
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి మార్చిలో నిర్వహించిన రెండవ విడత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2021 ఫలితాలు ఈనెల చివరి వారంలో వెలువడనున్నాయి. మార్చి 16, 17, 18 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ గడువు సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. ఫిబ్రవరిలో నిర్వహించిన తొలివిడత సెషన్ పరీక్షలకు మాదిరిగానే ఈ రెండో విడతలోనూ ప్రశ్నలు ఒకింత మధ్యస్తంగా, సులభంగా ఉండటంతో కటాఫ్ మార్కులు ఎక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.రెండో సెషన్లో 200 మార్కుల స్కోరు సాధించిన వారికి 90కి పైగా పర్సంటైల్ దక్కే అవకాశముంటుందని ప్రాథమిక కీ విడుదల అనంతరం ఆయా సబ్జెక్టుల నిపుణులు, కోచింగ్ సెంటర్ల అధ్యాపకులు అంచనా వేస్తున్నారు.
ప్రాథమిక కీపై అభ్యంతరాల పరిశీలన పిదప సవరణలతో తుది విడత కీ విడుదల సమయంలో తుది మార్కుల స్కోరు, పర్సంటైల్ ఖరారు అవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం జేఈఈ మెయిన్ కటాఫ్ ఓపెన్ కేటగిరీకి 90 నుంచి 100 పర్సంటైల్ వరకు ఉండవచ్చని, రిజర్వుడ్ కేటగిరీలో 60 నుంచి 70 పర్సంటైల్ మధ్య ఉండే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. 200 మార్కులు వచ్చే అభ్యర్థులు 90–100 పర్సంటైల్ సాధించగలుగుతారని చెబుతున్నారు. ఫిజిక్సు, మేథ్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు ఈసారి సులభంగా ఉండటంతో జేఈఈ మెయిన్ 2020 కటాఫ్ కన్నా ఈసారి కటాఫ్ ఎక్కువగానే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో నాలుగు విడతలుగా జేఈఈ మెయిన్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు మూడో విడత, మే 24 నుంచి 28 వరకు నాలుగో విడత మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని విడతలు ముగిసిన అనంతరం అభ్యర్థులకు వచ్చిన మార్కుల స్కోరును అనుసరించి కటాఫ్ పర్సంటైల్ను ప్రకటించనున్నారు.
2018లో తక్కువ కటాఫ్
జేఈఈ మెయిన్లో 2019లోని కటాఫ్తో పోలిస్తే 2020 కటాఫ్లు స్వల్పంగా పెరిగాయి. అంతకుముందు 2018 జేఈఈ మెయిన్లో ప్రశ్నలు కఠినంగా ఉండటంతో కటాఫ్ పర్సంటైల్ తక్కువగా ఉంది. జేఈఈ మెయిన్ 2017లో కటాఫ్ పర్సంటైల్ మళ్లీ అధికంగానే ఖరారైంది. ఆ కటాఫ్ గణాంకాలు పరిశీలిస్తే ఏమేరకు పెరుగుదల, తగ్గుదల ఉందో స్పష్టమవుతుంది.