![Human Positive Bird Flu Case Identified At Eluru District](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Birf.jpg.webp?itok=wS50elAK)
సాక్షి, ఏలూరు: ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్కు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో, అతడికి టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా తేలింది. ఈ క్రమంలో వైద్యశాఖ అధికారులు అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్ మాలిని మాట్లాడుతూ.. జిల్లాలో ఓ వ్యక్తిని బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇక్కడ తొలి కేసు నమోదైంది. దీంతో, కేసు నమోదైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.
మరోవైపు.. ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్ఫెక్టెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వే లెన్స్ జోన్లుగా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కమర్షియల్ ఫార్మ్ కోళ్లను, నాటు కోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వుల్లో తెలిపారు. ఏలూరు జిల్లా పశు సంవర్ధన కార్యాలయంలో 24x7 కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫోన్ నెంబర్ 9966779943 ఇచ్చారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు.
ఇదిలా ఉండగా.. తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంతో కానూరు అగ్రహారంలో చికెన్ షాపులను మూసివేశారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ గుడ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక, భారీగా తగ్గిన చికెన్, కోడిగుడ్ల వినియోగం తగ్గిపోయింది. దీంతో, పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
![Red Alert: బర్డ్ ఫ్లూ దెబ్బకి లక్షలాది కోళ్లు బలి](https://www.sakshi.com/s3fs-public/inline-images/ch_9.jpg)
Comments
Please login to add a commentAdd a comment