
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: పేదవారికి వినోదం భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని చిత్ర పరిశ్రమ స్వాగతించాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచి ప్రేక్షకులను ఇన్ని రోజులుగా కొందరు దోపిడీ విధానాన్ని అవలంభించారని విమర్శించారు. అటువంటి దోపిడీని అరికట్టడం కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమని తెలిపారు.
తెలంగాణలో టికెట్ రేట్లు పెంచిన కారణంగా అటు చిన్న సినిమాలకు, ఇటు పెద్ద సినిమాలకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఖాయమని పేర్కొన్నారు. సినిమా థియేటర్లలో తినుబండారల ధరలు, పార్కింగ్ చార్జీలను నియంత్రించాలని, నాసిరకమైన తినుబండారాలు అమ్ముతున్న థియేటర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్కు కేతిరెడ్డి విజ్ఞప్తి చేశారు.