తమ్ముడి మృతితో ఆగిన అక్క పెళ్లి | One Person Died In Kurnool Hours Before His Sister Marriage, More Details Inside | Sakshi
Sakshi News home page

తమ్ముడి మృతితో ఆగిన అక్క పెళ్లి

May 19 2025 9:01 AM | Updated on May 19 2025 10:45 AM

one died in Kurnool

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి,మరో ఇద్దరి పరిస్థితి విషమం

 పెళ్లింట అలుముకున్న విషాదం 

ఆలూరు రూరల్‌(కర్నూలు): అందరూ వివాహ వేడుకల్లో ఆనందంగా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో కల్యాణ తంతు నిర్వహించాల్సి ఉంది. ఇంతలోనే విషాదం. వధువు తమ్ముడు రోడ్డు ప్రమా దంలో దుర్మరణం చెందడంతో అక్క వివాహం నిలిచిపోయింది. శనివారం రాత్రి హుళేబీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన ఆనంద్‌ (19) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని స్నేహితులు పూర్ణచంద్ర, తిమ్మప్ప తీవ్రంగా గాయపడ్డారు.

 ఆదోని ఆస్పత్రిలో పూర్ణచంద్ర, కర్నూలు ఆస్పత్రిలో తిమ్మప్ప చికిత్స పొందుతున్నారు. ఆస్పరికి చెందిన తిమ్మన్న, శుకుంతల కుమారుడు ఆనంద్‌.. కాగా అతని సోదరి వివాహం హొళగుంద మండలం వందవాగిలి గ్రామంలో ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది.  ఆనంద్, పూర్ణచంద్ర, తిమ్మప్ప గుంటూరులోని ఆర్‌వీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. పూర్ణచంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లా కంభం గ్రామం కాగా తిమ్మప్పది ఆస్పరి మండలం చిగిళి గ్రామం. 

శనివారం రాత్రి ఆనంద్‌ సోదరి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్‌ మృతితో  అతని సోదరి పెళ్లి ఆగిపోయింది. అక్క పెళ్లికి వచ్చి తమ్ముడి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఎమ్మెల్యే పరామర్శ.. 
ఆనంద్‌ మృతి బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆదివారం ఆయన ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆనంద్‌ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement