పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి.. | Police kidnap teacher Munir over land dispute | Sakshi
Sakshi News home page

పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి..

Published Mon, Dec 23 2024 4:02 AM | Last Updated on Mon, Dec 23 2024 4:02 AM

Police kidnap teacher Munir over land dispute

భూ వివాదం విషయంలో మునీర్‌ అనే టీచర్‌ను కిడ్నాప్‌ చేసిన పోలీసులు 

2016 నుంచి వివాదంలో రూ.20 కోట్ల విలువైన భూమి.. కోర్టుతో పని లేకుండా సెటిల్‌ చేసుకోవాలని సీఐ నుంచి డీఐజీ వరకు ఒత్తిళ్లు 

పోలీసుల ఒత్తిడి, రాజకీయ బెదిరింపుల నేపథ్యంలో తన కుటుంబాన్ని అంతం చేస్తారని బెంబేలెత్తుతున్న మునీర్‌ అహ్మద్‌

కర్నూలు జిల్లాలో సంచలనంగా కిడ్నాప్‌ వ్యవహారం

సాక్షి ప్రతినిధి కర్నూలు: ఎవరైనా కిడ్నాప్‌ చేస్తే పోలీ­సు­లను ఆశ్రయిస్తాం. మరి పోలీసులే కిడ్నాప్‌ చేస్తే. ఎవ­రిని ఆశ్రయించాలి. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లా­లి. కూటమి ప్రభుత్వంలో లా అండ్‌ ఆర్డర్‌ తీరు­ను, ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని స్పష్టం చేసే ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. భూవి­వాదాన్ని కోర్టులతో పనిలే­కుండా సెటిల్‌ చేసు­కో­వాలంటూ ఓ ఉపాధ్యాయు­డిని కర్నూ­లు పోలీ­సులు కిడ్నాప్‌ చేశారు. అర్ధరాత్రి వరకూ బెదిరించి మరీ అతడిని ఇంటికి పంపారు. 

కిడ్నాపైన ఉపా­ధ్యా­యుడు మునీర్‌ అహ్మద్, అతని భార్య తెలి­పిన వివరాలిలా ఉన్నా­యి. మునీర్‌ అహ్మద్‌ కర్నూలు వాసి. వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠ­శా­­ల­లో ఇంగ్లిష్‌ ఉపా­ధ్యాయుడిగా పని చేస్తున్నారు. మునీర్‌ శనివారం స్కూల్‌లో పాఠాలు చెబుతుండ­గా.. ఇద్దరు పోలీసులు మఫ్టీలో వచ్చి సీఐ రమ్మంటు­న్నారని చెప్పారు. హెడ్‌మాస్టర్‌­కు చెప్పి వస్తాన­న్నా విన­కుండా సెల్‌ఫోన్‌ లాగేసు­కుని అతడిని బలవంత­ంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. 

ఎక్కడికి తీసు­కెళ్తున్నారని అడిగితే.. వెల్దుర్తి స్టేషన్‌ అని ఒక­సారి, డీఐజీ ఆఫీసుకు అని ఇంకోసారి చెప్పి చివరకు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. ‘ఏంటి గన్‌­తో కాల్చి చంపేస్తారా’ అని గట్టిగా కేకలు వేయగా పోలీ­సులు అతడి నోరుమూసేశారు. అక్కడ ఓ గది­లో అప్పటికే కొంతమంది వ్యక్తులకు పోలీసులు కౌన్సె­లింగ్‌ ఇస్తున్నారు. అప్పటికే అతని సోదరుడు మక్బూ­ల్‌ను కూడా అక్కడికి తీసుకొచ్చారు. అక్కడే మునీర్‌ను ఉంచారు. 

పక్కన ఉన్న వారిని కొడుతున్న దెబ్బలకు మునీర్‌ బెదిరిపోయాడు. రాత్రి 11 గంటల తర్వాత సీఐ శేషయ్య వచ్చి భూవివాదం గురించి మాట్లాడి పంపించేశారు. కిడ్నాప్‌ నేపథ్యంలో మునీర్‌ను ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడి తీసుకెళ్లారో అర్థంకాక అతడి సతీమణి రెహానాబేగం, పాఠశాల హెడ్‌మాస్టర్‌ మల్లయ్య వెల్దుర్తి, కర్నూలు త్రీటౌన్‌ పోలీసుల చుట్టూ తిరిగారు. ఎవరూ స్పందించలేదు. తన భర్త కిడ్నాప్‌ అయ్యారంటూ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు తీసుకోలేదు.

అసలు కారణం ఇదీ
మునీర్‌ అహ్మద్‌ కుటుంబానికి కర్నూలు కేంద్రీయ విద్యా­లయం సమీపంలో భూమి ఉంది. అన్నద­మ్ము­లు భాగపరిష్కారాలు చేసుకున్న తర్వాత సర్వే నంబర్‌ 649/2ఏలో 1.17 ఎకరాలు మునీర్‌ అధీనంలో ఉంది. 1910 నుంచి రికార్డులు ఆ కుటుంబం పేరిటే ఉన్నాయి. 2016లో ధనుంజయ అనే వ్యక్తి ఆ ప్రాంత­ంలోనే 6 ఎకరాలు కొనుగోలు చేశాడు. తాను కొను­గోలు చేసిన సర్వే నంబర్లలోనే మునీర్‌ అహ్మద్‌ 1.17 ఎకరాలు కూడా ఉన్నాయని ధనుంజయ్‌ కోర్టును ఆశ్రయించాడు. 

కోర్టు మునీర్‌కు అను­కూలంగా తీర్పు ఇచ్చి­ంది. దీనిపై హైకోర్టులో ధనుంజయ్‌ అప్పీల్‌ చేశా­డు. ఈ క్రమంలో కోడుమూరు టీడీపీ ఇన్‌చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, మనీశ్‌ అనే వ్యక్తి కలిసి వివాదాన్ని సెటిల్‌ చేసుకోవాలంటూ మునీర్‌ను బెదిరించారు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా కోర్టు­లో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మునీర్‌ ఉన్నారు. కూటమి ప్రభు­త్వం అధికారంలోకి రాగా.. సెప్టెంబర్‌లో ధనుంజయ్, అతడి తరఫు వ్యక్తి కడప విష్ణువర్ధన్‌రెడ్డిని పిలి­పించి సెటిల్‌ చేసుకో­వాలని చెప్పా­రు. 

ఆపై సీఐ మురళీధర్‌రెడ్డి అక్టోబర్‌ 30న పిలిపించి డీఐజీ, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని సెటి­ల్‌ చేసుకో­వాలని మునీర్‌కు, అతని సోదరుడు మ­క్బూ­ల్‌కు చెప్పారు. ఆ తర్వాత సీఐ బదిలీ అయ్యా­రు. ఈ క్రమంలో మునీర్, మక్బూల్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిశారు. ‘భూ వివాదం తెంచుకో­వాలి. ఇక్కడ లా ముఖ్యం కాదు. 

ఇప్పటికే 9 ఏళ్లయి­ంది. మరో పదేళ్లయినా కోర్టులో తెగదు. ఆలోచించుకోండి. ఒక రేటు మాట్లాడుకుని వదిలే­యండి. మా సీఐ మీ వాళ్లతో మాట్లాడ­తారు’ అని చెప్పారు. దీంతో వారు వెనుదిరిగి వచ్చేశారు. శనివారం పోలీసులు వెళ్లి మునీర్‌ను కిడ్నాప్‌ చేసి, అర్ధరాత్రి తిరిగి పంపించారు.

నన్ను చంపేస్తారు
నన్ను తీసుకెళ్లిన పోలీసులు గన్‌తో కాల్చి చంపేస్తారని భయపడ్డా. భూ వివాదాన్ని సెటిల్‌ చేసుకోవాలని సీఐ నుంచి డీఐజీ వరకూ ఒత్తిడి చేస్తున్నారు. మార్కెట్‌ రేటు కంటే 30 శాతం తక్కువ ఇచ్చినా వదిలేస్తా. కానీ.. వారు ఇచ్చిందే తీసుకోవాలనేలా మాట్లాడుతున్నారు. మా భూమి మేమెందుకు వదిలేయాలి. 

నాకు దివ్యా­ంగురాలైన కుమార్తె ఉంది. పోలీసుల తీరు, ధనుంజయ్‌ తరఫు వ్యక్తి కడప విష్ణువర్ధన్‌­రెడ్డి బెదిరింపులు చూస్తే కచ్చితంగా నా కుటుంబాన్ని చంపేస్తారనే భయం కలుగుతోంది. నన్ను చంపినా ఫర్వాలేదు. నా భార్య, బిడ్డలైనా బతి­కితే చాలు. నేను ముస్లిం కాబట్టే బెదిరి­స్తున్నారా అనిపిస్తోంది.     – మునీర్‌ అహ్మద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement