
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పనను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో శివ్నందకుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం బుధవారం రాజమహేంద్రవరానికి చేరుకుంది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, సీఈలు రాజేశ్కుమార్, వెంకటసుబ్బయ్య, డైరెక్టర్ దేవేందర్రావు ఈ బృందంలో ఉన్నారు. పీపీఏ సీఈవోగా శివ్నందకుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలిస్తుండడం ఇదే తొలి సారి.
గురువారం పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే కనెక్టివిటీలను పీపీఏ బృందం పరిశీలిస్తుంది. శుక్రవారం ఏలూరు జిల్లాలో తాడ్వాయి, కృష్ణునిపాలెం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీలను పరిశీలించి, నిర్వాసితులతో సమావేశమవుతుంది. ఆ తర్వాత ఈ సీజన్లో చేయాల్సిన పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు అధికారులతో పీపీఏ బృందం సమీక్ష సమావేశం నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment