Fact Check: గురుకులాలపై ఈనాడు వక్రభాష్యాలు | FactCheck: Eenadu Ramoji Rao Fake News On Gurukulas In AP, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: గురుకులాలపై ఈనాడు వక్రభాష్యాలు

Published Fri, Apr 5 2024 5:32 AM

Ramoji Rao fake news on gurukulas - Sakshi

గురివిందా.. మార్పు కనిపించదా?

చంద్రబాబు హయాంలో 41 బీసీ గురుకులాలు

దశలవారీగా 105కు పెంచిన జగన్‌ సర్కార్‌

బడ్జెట్‌ కేటాయింపులనూ పెంచింది ఈ ప్రభుత్వమే..

ఐఐటీ, ఎన్‌ఐటీ, ఎంబీబీఎస్‌ సీట్లు సాధించిన  విద్యార్థులు

నాడు–నేడుతో 37 గురుకుల పాఠశాలలకు మహర్దశ

తెలంగాణాతో పోలిక పెట్టి ఏపీపై బురదచల్లే ప్రయత్నం 

రామోజీ రాతల ‘పచ్చ’పాతం...

అదేదో సినిమాలో ... ‘మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నా.. మీరు ఇక్కడే ఉంటారని’..చెప్పే హాస్యనటుడి డైలాగ్‌ చంద్రబాబు–రామోజీలకు  సరిపోతుందేమో...ఎన్నికలేమో దగ్గరపడుతున్నాయి...తన శిష్యుడు చంద్రబాబును ఎంత ఎత్తుదామన్నా...రాజకీయంగా అథఃపాతాళానికి దిగజారిపోయిన ప్రతిష్ఠను తీసుకురాలేని దౌర్భాగ్య స్థితిలో రామోజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై రాళ్లేయాలని చూస్తున్నారు...

ఇది ఆకాశమ్మీద రాయివేసిన చందమేనని రామోజీకి అర్థం కావడం లేదేమో... తాజాగా గురుకులాలపై ఈ పచ్చపాత పెద్ద వక్రదృష్టి సారించి, తన విషప(పు)త్రికలో కట్టుకథలు అల్లారు...చంద్రబాబు ప్రభుత్వంలో గురుకులాల సంఖ్య పెరగలేదు..అక్కడి విద్యార్థుల సంక్షేమాన్ని బాబు పట్టించుకోలేదు...విద్యా ప్రమాణాలనూ గాలికొదిలేశారు...

ఇప్పుడివన్నీ జగన్‌ ప్రభుత్వం పట్టించుకుంది..గురుకులాలు పెరిగాయి..డైట్‌ ఛార్జీలు పెరిగాయి...విద్యా ప్రమాణాలూ పెరిగాయి....ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, నీట్, ఇంజనీరింగ్‌ సీట్లను  గురుకుల విద్యార్థులు సాధిస్తున్నారు.. గురుకులాల పేరిట కలకలం రేపాలని రామోజీ తహతహలాడుతూ చదువుల తల్లినీ అవమానిస్తున్నారు...  కళ్లు విప్పార్చుకుని చూస్తే ఈ ఎల్లో పెద్దకు నిజానిజాలు తెలుస్తాయి...

సాక్షి, అమరావతిః బీసీ విద్యార్థులు చదివే గురుకుల విద్యాలయాలపైనా రామోజీ గురివింద రాతలు మానలేదు. తెలంగాణాతో పోలిక పెట్టి ఆంధ్రప్రదేశ్‌పై బురద చల్లేందుకు  ఈయన తాపత్రయ పడ్డారు. పేద పిల్లలకు పెద్ద చదువులు దక్కాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషిని వెక్కిరిస్తూ  వెకిలి రాతలు రాసేశారు.

బీసీ గురుకులాల మంజూరు, నిర్మాణం, విద్యార్థులకు వసతులు, మెరుగైన ఫలితాలు తదితర అనేక విషయాల్లో చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చ­డమే కాకుండా సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో విజయాలను మరుగుపరిచే  కుటిలయత్నం ఈ రాతల్లో స్పష్టంగా కన్పించింది. ఈనాడు అబద్ధాలను దునుమాడే వాస్తవాలు ఇవిగో.. 

ఆరోపణః వైకాపా పాలనలో గురుకులాలకు అథమ స్థానం
వాస్తవంః రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన బీసీ గురుకుల విద్యాలయాలకు సీఎం వైఎస్‌ జగన్‌ మహర్దశ తీసుకొచ్చారు. చంద్రబాబు హయాంలో కేవలం 41 గురుకులాలు ఉంటే.. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన అనంతరం వాటిని 105కు పెంచారు. విద్యార్థుల సంఖ్యా గణనీయంగా పెరగడంతో పాటు వారికి అవసరమైన నాణ్యమైన విద్య, మౌలిక వసతులు అందించడంలో  జగన్‌ ప్రత్యేక శ్రద్ధతో అనేక చర్యలు చేపట్టారు. 

♦ చంద్రబాబు హయాంలో 2018–19 నాటికి రాష్ట్రంలో బీసీ గురుకులాలు  కేవలం 41 మాత్రమే ఉన్నాయి. 
♦ 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు హడావుడిగా 65 కొత్త గురుకులాలు మంజూరు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. వాటిని కనీసం గ్రౌండింగ్‌ అయినా చేయలేదంటే చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న 2019 ఏప్రిల్‌లో హడావుడిగా 21 గురుకులాలు ప్రారంభించినట్టు బిల్డప్‌ ఇచ్చి జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. 
♦ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన అనంతరం 2019 నుంచి 2023లోపు 41 కొత్త గురుకులాలను ప్రారంభించారు. 2023లో మరో రెండు కొత్త గురుకులాలను సీఎం జగన్‌ ప్రారంభించారు. దీంతో చంద్రబాబు హయాంలో 41 గురుకులాలు ఉంటే, జగన్‌ ప్రభుత్వ హయాంలో వాటి సంఖ్య 105కు పెరిగిన విషయాన్ని ఈనాడు దాచిపెట్టింది. ఈ గురుకుల విద్యాలయాల్లో 2018–19 విద్యా సంవత్సరం (చంద్రబాబు పాలన)లో 25,629 మంది విద్యార్థులుంటే.. 2023–24 విద్యా సంవత్సరానికి (జగన్‌ సర్కారు)లో 38,188 మంది విద్యార్థులు పెరగడం గమనార్హం. 
♦ రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో 14 జూనియర్‌ గురుకుల కాలేజీలు ఉంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా మరో నాలుగు మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, నంద్యాల జిల్లా డోన్, బేతంచెర్ల, చిత్తూరు జిల్లా సదుంలో కొత్తగా జూనియర్‌ గురుకుల కాలేజీలు ప్రారంభించింది.
♦ హెయిర్‌ కటింగ్‌ కోసం 3వ తరగతి నుంచి బాలురకు నెలకు గత ప్రభుత్వం రూ.30 ఇస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.50కి పెంచింది. 

ఆరోపణః బిల్లులు చెల్లించలేదు...
వాస్తవంః బడ్జెట్‌ కేటాయింపుల్లోను జగన్‌ సర్కారు ఉదారంగా నిలిచిందనే విషయం గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది.   చంద్రబాబు అధికారం చేపట్టిన తొలినాళ్లలో కేవలం రూ.45 కోట్లు కేటాయిస్తే.. సీఎం జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి రూ.213 కోట్లకు పైగా ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఈ నిజాలనూ రామోజీ దాచేశారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం  జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లేందుకు  వాస్తవాలను వక్రీకరించి బోగస్‌ రాతలు రాస్తున్నారు.

ఆరోపణః ‘అద్దె’సరు భవనాలు..
వాస్తవంః  పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఇంగ్లీష్‌ మీడియం చదువులు, ప్రభుత్వ బడుల సౌకర్యాలను మెరుగు పర్చడంలో సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందనే విషయం రామోజీకి మింగుడు పడటంలేదు. ప్రభుత్వ బడులు మాదిరిగానే బీసీ గురుకులాల రూపురేఖలను నాడు–నేడు కార్యక్రమంతో మార్చిన విషయాన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగా మరుగున పరిచింది. తొమ్మిది ప్రధానమైన మౌలిక వసతులు కల్పిస్తూ బీసీ గురుకులాలను తీర్చిదిద్దింది.

రాష్ట్రంలో 37 గురుకులాలను రూ.17.97 కోట్లతో అభివృద్ధి చేసింది. వాటికి నీటి సరఫరాతో కూడిన టాయిలెట్లు, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లతో విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, పాఠశాలకు పెయింటింగ్, మరమ్మతులు, ఆకుపచ్చ సుద్ద బోర్డులు, ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు, ప్రహరీ గోడలు నిర్మించింది. జూనియర్‌ కాలేజీ భవనాల నిర్మాణం విషయానికి వస్తే.. గత ప్రభుత్వం (2014–19)లో రూ.102.60 కోట్లు కేటాయిస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం (2019–­23)­లో రూ.194 కోట్లు కేటాయించింది. 

ఫలితాలే గీటురాయి..
ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమేరకు ఫలప్రదమయ్యాయో తెలియాలంటే ఆయా విద్యా సంస్థల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలే గీటురాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీ గురుకుల విద్యార్థులకు ప్రత్యేకంగా ఐఐటీ, నీట్‌లో ప్రత్యేక కోచింగ్‌ ఇవ్వడంతో వారు ఉత్తమ ఫలితాలు సాధించారు. 
♦ బిసీ గురుకులాల్లో 2022–23లో పదో తరగతిలో 90 శాతం, ఇంటర్మీడియట్‌లో 90.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
♦ ఎంపీసీ (ఐఐటీ అడ్వాన్డ్స్‌)లో 2019–20లో 102 మంది విద్యార్థుల్లో 37 మంది అర్హత సాధించారు. 2020–21లో 205 మందికి 65 మంది అర్హత సాధించారు. 2021–22లో 147 మందికి 45 మంది అర్హత సాధించారు. 
♦ఐఐటీ, నీట్, పోటీ పరీక్షల్లో 2022–23లో మంచి ప్రతిభ కనబరిచిన 40 మంది గురుకుల విద్యార్థులు సీట్లు సాధించారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీలో ఆరుగురు, ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 24, నీట్‌ (బైపీసీ స్ట్రీమ్‌)లో ఎంబీబీఎస్‌లో నాలుగు, డెంటల్‌లో ఒక సీటు, వెటర్నరీ 4, అగ్రికల్చర్‌ లో ఒక సీటును సాధించారు. 

ఆరోపణః బీసీ విద్యార్థుల వెన్ను విరిచారు.
వాస్తవంః పేద పిల్లలు చదివే గురుకులాల్లో చంద్రబాబు ప్రభుత్వం కనీసం డైట్, కాస్మొటిక్, హెయిర్‌ కట్‌ వంటి ఛార్జీల పెంపుదల మాటే   పట్టించుకోలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక వాటిని పెంచి అందిస్తున్నారు. ఈ వివరాలు గమనిస్తే ఈనాడు రాసినవన్నీ కట్టుకథలని ఇట్టే తేటతెల్లమవుతాయి.   

Advertisement
Advertisement