శ్రీవారి నిధుల దోపిడీకి బాబు సర్కారు స్కెచ్‌ | Reverse tendering has been canceled in TTD | Sakshi
Sakshi News home page

శ్రీవారి నిధుల దోపిడీకి బాబు సర్కారు స్కెచ్‌

Oct 6 2024 5:17 AM | Updated on Oct 6 2024 7:22 AM

Reverse tendering has been canceled in TTD

టీటీడీలోనూ రివర్స్‌ టెండరింగ్‌ రద్దు 

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈవో ఉత్తర్వులు  

2019 ఆగస్టు 16కంటే ముందు ఉన్న పాత పద్ధతి ప్రకారమే టెండర్లు 

నెయ్యి, ముడి సరుకులు, ఇంజినీరింగ్‌ పనులు తదితర టెండర్లలో అవినీతికి స్కెచ్‌

అధిక ధరలకు అయిన వారికి కట్టబెట్టేందుకు కుట్ర 

శ్రీవారి ఖజానా నుంచి రూ.వందల కోట్ల దోపిడీకి వ్యూహం 

రివర్స్‌ టెండరింగ్‌తో ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లు ఆదా చేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ధర్మో రక్షతి రక్షితః.. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే.. ఆ ధర్మమే మనల్ని సంరక్షిస్తుందన్న ఆర్యోక్తి తిరుమల కొండల్లో కనుమరుగైపోతోంది. ధర్మాన్ని రక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలే దానికి పాతరేశారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోని ముఖ్యులు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఖజానాను కాంట్రాక్టర్లతో కలిసి దోచేసిన తరహాలోనే ఇప్పుడూ దోపిడీకి తెరతీశారు. ఇందుకోసం అత్యంత పారదర్శకమైన, ప్రజా ధనాన్ని ఆదా చేసే రివర్స్‌ టెండరింగ్‌ను టీటీడీలో రద్దు చేశారు. 

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 2019 ఆగస్టు 16న రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని చంద్రబాబు కూటమి ప్రభుత్వం గత నెల 15న రద్దు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ఉత్తర్వులను టీటీడీలోనూ అమలు చేస్తూ.. రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేస్తూ ఈవో జె.శ్యామలరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

దీనిద్వారా 2019 ఆగస్టు 16కు ముందు టీటీడీలో అమల్లో ఉన్న పాత పద్ధతి ప్రకారమే నెయ్యి, ముడిసరుకుల కొనుగోలు, నిర్మాణ పనులు తదితర పనులకు టెండర్లు నిర్వహించడానికి మార్గం సుగమమైంది. అధికంగా కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లతో టెండర్లకు ముందే కుమ్మక్కై, అంచనా వ్యయాన్ని పెంచేసి, ఆపై అధిక ధరలకు కాంట్రాక్టులు అప్పగించడం ద్వారా శ్రీవారి ఖజానాను మళ్లీ దోచేయడానికి స్కెచ్‌ వేసినట్లు బాబు సర్కారు తాజా చర్యలు చెబుతున్నాయి. 

రివర్స్‌ టెండరింగ్‌తో  శ్రీవారి ఖజానాకు భారీగా ఆదా 
రాష్ట్ర విభజన తర్వాత జనసేన, బీజేపీతో కూటమి కట్టి 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అప్పట్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై టెండర్ల వ్యవస్థను నీరుగార్చి అధిక ధరలకు పనులు అప్పగించడం ద్వారా శ్రీవారి ఖజానా నుంచి రూ.వందలాది కోట్లు, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.20 వేల కోటుŠల్‌ ఆ ప్రభుత్వంలోని ముఖ్య నేతలు, పలువురు కాంట్రాక్టర్లు దోచేశారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ దోపిడీ వ్యవస్థకు తెరదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టెండర్ల వ్యవస్థను సంస్కరించారు. 

చట్టం చేసి మరీ జ్యుడిషియల్‌ ప్రివ్యూ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం రూ. వంద కోట్లు అంతకంటే ఎక్కువ ఖర్చయ్యే పనుల టెండర్‌ ముసాయిదాను జ్యుడిíÙయల్‌ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపుతారు. దానిపై జడ్జి ఆన్‌లైన్‌లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని ముసాయిదా మార్పులు ఉంటే సూచిస్తారు. లేదంటే యథాతధంగా ఆమోదిస్తారు. 

జడ్జి ఆమోదించిన ముసాయిదా షెడ్యూలుతోనే టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలి. రూ.కోటి అంత కంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో టెండర్లు నిర్వహించేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2019 ఆగస్టు 16న జీవో 67 జారీ చేసింది. దీని ద్వారా టెండర్ల వ్యవస్థను వైఎస్‌ జగన్‌ అత్యంత పారదర్శకంగా మార్చారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం దోపిడీలో భాగంగా అనుసరించిన కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సు ఇచ్చే నిబంధనను కూడా వైఎస్‌ జగన్‌ తొలగించారు. 

ఇలా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. 2019–24 మధ్య ప్రభుత్వ ఖజా­నాకు రూ.7,500 కోట్లకు పైగా ఆదా చేశారు. శ్రీవారి ఖజానాకు రూ.వందలాది కోట్ల రూపాయలు మిగిల్చారు.

రివర్స్‌ టెండరింగ్‌ ఇలా.. 
» టెండర్‌లో ఆర్థిక బిడ్‌ తెరిచాక తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్‌–1గా ఖరారు చేస్తారు.  
»    ఎల్‌–1 కాంట్రాక్టర్‌ కోట్‌ చేసిన మొత్తాన్నే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. ఆన్‌లైన్‌లో 2.30 గంటలపాటు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తారు. 
»  రివర్స్‌ టెండరింగ్‌ సమయం ముగిసేసరికి అత్యంత తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌కు సాంకేతిక కమిటీ సిఫార్సు మేరకు పనులు అప్పగిస్తారు. 
»   2016 ఆగస్టు 16 నుంచి శుక్రవారం వరకూ టీటీడీలో ఇదే విధానం ప్రకారం టెండర్లు నిర్వహించారు.  
»   టెండర్‌లో నిర్దేశించిన ప్రమాణాల మేరకు నాణ్యమైన ముడిసరుకులు, స్వచ్ఛమైన నెయ్యిని తక్కువ ధరకే కొనుగోలు చేసి శ్రీవారి ఖజానాను పరిరక్షించారు. 
»    టెండర్‌లో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ముడిసరుకులు, నెయ్యి లేనట్లు పరీక్షల్లో తేలితే ఆ సరుకులు తెచ్చిన లారీ, నెయ్యి తెచ్చిన ట్యాంకర్‌ను సరఫరా సంస్థకే వెనక్కి పంపేశారు. 
»   తద్వారా అత్యంత నాణ్యమైన ముడి సరుకులు, స్వచ్ఛమైన నెయ్యిని కాంట్రాక్టు సంస్థలు టీటీడీకి సరఫరా చేశాయి.  

Advertisement
 
Advertisement
Advertisement