
సాక్షి, తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమలి పింఛం, గదతో దామోదర కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.