
విజయవాడ స్పోర్ట్స్: విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) కేంద్రంలో బాక్సింగ్, వాలీబాల్ క్రీడల్లో శిక్షణ తీసుకునేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్, ఎండీ ప్రభాకరరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
దీనిలో భాగంగా 10 నుంచి 16 ఏళ్ల వయసు కలిగిన బాలబాలికలకు వాలీబాల్, బాక్సింగ్ల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్ శిక్షణకు హాజరయ్యేవారు ఈ నెల 21, 22 తేదీల్లో, బాక్సింగ్ శిక్షణకు హాజరు కావాలనుకునేవారు ఈ నెల 23, 24 తేదీల్లో విశాఖపట్నం పోర్టు స్టేడియంలో జరిగే ఎంపిక పోటీలకు రావాలని సూచించారు. జనన ధ్రువీకరణ పత్రం, విద్యార్హత, ఆరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్కార్డ్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇంతకుముందు పాల్గొన్న క్రీడల సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరారు.
మరిన్ని వివరాలకు 8247443921 (బాక్సింగ్), 9440587614 (వాలీబాల్) నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ శిక్షణ కేంద్రంలో అర్హత కలిగిన కోచ్లు, ట్రైనీలతో శిక్షణ ఇస్తామన్నారు. అలాగే పౌష్టికాహారం, అత్యాధునిక సదుపాయాలు కలిగిన కిట్లు, విద్య, వైద్య, బీమా సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment