
బాధితుల్లో ఒకరు వైద్యురాలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లాలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు బీపీ, షుగర్తో పాటు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. అతనికి గత నెల 30న ఆయాసం అధికమవడంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చే ర్పించారు.
లక్షణాలను గమనించిన వైద్యులు కోవిడ్ పరీక్ష చేయించడంతో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అలాగే మంత్రాలయం మండలం పారందొడ్డి గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతి గత నెల 8న తిరుపతిలోని స్విమ్స్లో గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ఆమెకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో 30న చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించి పరీక్ష చేయించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది.
అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలోని 54 ఏళ్ల ఓ వైద్యురాలికీ కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించారు. ఈమె హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటుండగా, మిగిలిన ఇద్దరూ ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక కోవిడ్ విభాగంలో వైద్యసేవలు పొందుతున్నారు.