పారదర్శకంగా టీచర్ల బదిలీలు | Transfers Of Teachers Transparently In AP | Sakshi

పారదర్శకంగా టీచర్ల బదిలీలు

Dec 12 2020 4:41 AM | Updated on Dec 12 2020 9:04 AM

Transfers Of Teachers Transparently In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి జవాబుదారీతనం, పారదర్శకతతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానంలో నిర్వహిస్తున్నామని, దీనివల్ల టీచర్లకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. వారు తమకు అందుబాటులో ఉన్న అన్ని ఖాళీలకు ఆప్షన్లు నమోదు చేయవచ్చన్నారు. మాన్యువల్‌లో పది నిమిషాల సమయం కూడా ఉండదని, అదే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ వల్ల 5 రోజుల సమయం దొరుకుతుందని చెప్పారు. పైగా ఇతరులు వదిలేసిన ఖాళీలకు కూడా ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశముంటుందన్నారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను అన్ని జాగ్రత్తలు తీసుకొని సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ నెల 16 నుంచి 21 వరకు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తుది కేటాయింపులుంటాయన్నారు.

4 కేటగిరీలుగా బదిలీలు.. 
20 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ–1గా, 14.5 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రాతాలను కేటగిరీ–2గా, 12 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రాంతాలను కేటగిరీ–3 గా, 12 శాతం కంటే తక్కువ హెచ్‌ఆర్‌ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ–4గా విభజించి.. బదిలీలు చేస్తున్నట్లు తెలిపారు. సర్వీసును బట్టి ఏడాదికి 0.5 వంతున మార్కులు కేటాయించి.. వాటి ఆధారంగా బదిలీల ప్రక్రియలో ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. నిబంధనల ప్రకారం సర్దుబాటు ప్రక్రియ చేసి మిగులు పోస్టులు, ఖాళీలను కలిపి 4 కేటగిరీలకు సమానంగా ఉండేలా చూస్తున్నామని తెలిపారు. గిరిజన, మారుమూల ప్రాంత స్కూళ్లలో కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండేలా బదిలీలు చేపడుతున్నామన్నారు. అన్ని పోస్టులను ఒకేసారి ఓపెన్‌ చేయడం వల్ల.. కేటగిరీ–4లో ఉన్న మారుమూల ప్రాంతాల స్కూళ్లకు ఎవరూ వెళ్లే పరిస్థితి ఉండదని.. దీంతో అక్కడ ఉపాధ్యాయుల సమస్య ఏర్పడుతుందన్నారు. అందుకే 15 వేల పోస్టులను బ్లాకు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ పోస్టులను మళ్లీ బదిలీల ప్రక్రియ ద్వారానే భర్తీ చేస్తామన్నారు. కొత్త ఉపాధ్యాయ నియామకాలకు ముందు మళ్లీ ఈ బదిలీల ప్రక్రియ ఉంటుందన్నారు. ఆ సమయంలో బ్లాక్‌లో పెట్టిన ఈ పోస్టులను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసి.. ఆ తర్వాత మిగిలే ఖాళీలను డీఎస్సీలో ఎంపిౖకైన వారితో భర్తీ చేస్తామన్నారు. మారుమూల, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఆ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. ఉపాధ్యాయ సంఘాల సూచనలను గౌరవిస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement