
సింగ్నగర్లో వరద బీభత్సం సృష్టించడంతో ప్రజల కష్టాలు హృదయ విదారకంగా మారాయి.
సాక్షి, విజయవాడ: సింగ్నగర్లో వరద బీభత్సం సృష్టించడంతో ప్రజల కష్టాలు హృదయ విదారకంగా మారాయి. వరద దాటే ప్రయత్నం చేస్తూ మహిళ మృతి చెందింది. గంగానమ్మ ఆలయం ఎదురుగా మసీదు రోడ్డులో ఈ ఘటన జరిగింది. నీటిలో నుంచి దాటుతుండగా మహిళ గుండెపోటుతో మరణించింది. తరలించలేక మృతదేహాన్ని కారుపైనే పెట్టి వదిలేశారు స్థానికులు. మొత్తం జలమయం కావడంతో జనజీవనం స్తంభించింది.
కాగా, మున్నేరుకు భారీగా వరద పోటెత్తింది. హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కీసర-ఐతవరం మధ్య రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. తీరం వెంబడి 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికాలు జారీ చేసింది.