
సాక్షి, అమరావతి: నారా లోకేశ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ అపశకునాలేనని, దుర్ఘటనలేనని, ఆ పాదం మహిమ అలాంటిదని, ఆయన ‘ఐరన్లెగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అని అంతా భావిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ చెప్పారు. అలాంటి పాదంతో లోకేశ్ చేసే పాదయాత్రలు జనావళికి ప్రమాదకరమని అన్నారు. ఆయన పాదయాత్ర బలియాత్రగా మారిందని తెలిపారు.
నాగార్జున యాదవ్ గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోకేశ్ పాదయాత్ర టీడీపీకి పాడెయాత్రగా మారిపోయిందన్నారు. లోకేశ్ను క్రేన్లతో లేపాలని చంద్రబాబు, ఎల్లో మీడియా ఎంత ప్రయత్నించినా విఫలమై చతికిలపడుతున్నారన్నారు.
తోలుమందం లోకేశ్ సభ్యత, సంస్కారాలు మరచిపోయి సీఎం జగన్ని నోటికొచ్చినట్లు దూషిస్తున్నాడని, తాము కూడా చంద్రబాబును తిట్టగలమని, కాకపోతే తమ నాయకుడు వైఎస్ జగన్ సభ్యత, సంస్కారం నేర్పించారని చెప్పారు. సీఎంజగన్ని వారు ఒక మాటంటే.. తాము వారిని నాలుగంటామని హెచ్చరించారు. లోకేశ్ ఒళ్లు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు.
పాదయాత్రకు జనం రాలేదని బాబు బాధ పడుతున్నారని, లోకేశ్ బూతులు వినడానికి జనం రావాలా... అని ప్రశ్నించారు. సమర్థుడైన కొడుకుంటే ఏ తండ్రయినా పవన్ కళ్యాణ్పై ఎందుకు ఆధారపడతారని అన్నారు. ఉత్తరకుమారుడికి ప్రగల్భాలు ఎక్కువ, లోకేశ్కు ఉడత ఊపులు ఎక్కువ అని ప్రజలు నవ్వుతున్నారని వ్యాఖ్యానించారు.
ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన సీఎం వైఎస్ జగన్తో ఈ ఐరన్ లెగ్ చౌదరి లోకేశ్ తలపడి తట్టుకోలేడని చెప్పారు. ఇప్పటికైనా లోకేశ్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment