
కూటమి ప్రభుత్వంలో వ్యవస్ధలన్నీ తిరోగమనమే
వైఎస్సార్సీపీ తెచ్చిన ప్రతి పథకం రద్దు చేసిన కూటమి
చంద్రబాబు ప్రతి పథకం.. మోసం, అబద్ధం
రాబోయేది జగన్ 2.0 పాలన
కూటమి పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం
గుంటూరు, సాక్షి: ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘2019-24 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచింది. ఆ టైంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పాలన నడిచింది. లంచాలకు తావు లేకుండా రూ. 2.71 లక్షల కోట్లు డీబీటీ చేశాం. కోవిడ్ వల్ల ఆదాయం తగ్గినా హామీలు అమలు చేశాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం. కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశాం. మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉంది.
ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు. బాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. మన హయాంలోని పథకాలన్నీ రద్దు చేశారు. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం.. అబద్ధం, మోసం.
మొన్నటి ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయి. కూటమి కంటే మనకు 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి. కారణం.. వారిలా నేను అబద్ధాలు చెప్పలేకోవడం, కానీ, జగన్.. కార్యర్తలు, ప్రజలందరి మనసులో ఉన్నాడు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీత ఉండాలి. మీ జగన్ మరో 25-30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు. మనం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. రేపు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన ఈ సర్కార్ పరిస్థితి ఏంటి?.
.. టీడీపీ నేతలు ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవు. హామీలు నెరవేర్చుకుంటే కాలర్ పట్టుకోవాలని వాళ్లే అన్నారు. బాబు ష్యూరీటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. ఇప్పుడు ఆ ష్యూరిటీ కాస్త మోసం అయ్యింది. ప్రజలు వాళ్ల కాలర్ పట్టుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఇసుక, మద్యం, పేకాట మాఫియాలు నడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఎలా చేయాలో చెవిలో చెప్పాలని అంటున్నారు. ఇలాంటి వ్యక్తిని ఛీటర్ అనకూడదా?. ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు పెట్టకూడదా?.
రాష్ట్రంలో స్కాంలు తప్ప ఏం జరగడం లేదు. దోచుకోవడం, పంచుకోవడమే జరుగుతోంది. ప్రశ్నిస్తున్నవారిపై 111 సెక్షన్ కేసులు పెడుతున్నారు. తీవ్రవాదులపై పెట్టే కేసులతో వేధించి జైళ్లలో పెడుతున్నారు. వైఎస్సార్సీపీ కేడర్ అరెస్టులకు భయపడొద్దు. మంచి పాలన చేస్తే ప్రజలు ఆదరిస్తారు. ఇలాంటి అన్యాయాలు చేస్తే ప్రజలే గుణపాఠం చెప్తారు.
రాబోయేది జగన్ 2.0 పాలన. మళ్లీ అధికారంలోకి వస్తాం. అందరి లెక్కలు తేలుస్తాం. అన్యాయాలు ఎవరు చేసిననా వదిలిపెట్టం. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం. మన పాలనలో రెండున్నరేళ్లు కోవిడ్ ఉంది అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయాం. జగన్ 2.0లో ప్రతీ కార్యకర్తకు తోడుంటాం. వాళ్ల ఇంటి పెద్దన్నగా వారికి తోడుగా ఉంటా’’ అని వైఎస్ జగన్ మరోసారి ఉద్ఘాటించారు.
ఈ భేటీకి హాజరైన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి, కాసు, బొల్లా సహా నియోజకవర్గాల సమన్వయ కర్తలు తదితరులు హాజరయ్యారు. అలాగే.. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Comments
Please login to add a commentAdd a comment