
వీలైనంత త్వరగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలి
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెక్యూరిటీని తెల్లారేసరికి తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కె.రవిచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆయనకు చెడు జరగాలని కోరుకుంటున్నారా? లేక మీ స్పాన్సర్డ్ మీడియాను పంపి హడావుడి చేయిస్తారా? అని నిలదీశారు. ఆయన మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వీఐపీలు ఉండే రోడ్లలో చెక్పోస్ట్లు ఉండటం, ఐడీ కార్డు అడగడం ప్రతిచోటా ఉంటుందని చెప్పారు.
తమ పార్టీ తరపున కేంద్రానికి అప్పీల్ చేస్తున్నామని, వైఎస్ జగన్కి వీలైనంత త్వరగా జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించాలని కోరుతూ కేంద్రానికి రిప్రజెంటేషన్ కూడా ఇస్తామని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ప్రభుత్వ ఉద్యోగులు చాలా విలువను పొందుతున్నామని అనుకుంటున్నారేమోగానీ ఉద్యోగులపై అప్పుడే చంద్రబాబు వివక్ష మొదలైంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిప్యుటేషన్పై వచ్చిన అధికారులను ఈనాడులో జలగన్నలంటూ రాశారు. అధికారులను అవమానిస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వ అధికారులను అదిరించి, బెదిరించి తన అజమాయిషీ చాటుకున్నారు. వారిని అనేక రకాలుగా అవమానించారు. మేం ఇంత త్వరగా రెస్పాండ్ కాకూడదని, ఈ ప్రభుత్వానికి 3 నెలలో, 6 నెలలో సమయం ఇవ్వాలని అనుకున్నాం. అప్పటివరకు ఆరోపణలు చేయకూడదనుకున్నాం. ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయకపోతే నిలదీయాలనుకున్నాం. కానీ ప్రభుత్వ అధికారులను అవహేళన చేసేవిధంగా రాయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాం.
2014 నుంచి 2019 వరకు డిప్యుటేషన్పై వచ్చిన అధికారులు రాజమౌళి ఐఏఎస్, కేవీవీ సత్యనారాయణ, వెంకయ్యచౌదరి, కల్నల్ అశోక్బాబు, సంధ్యారాణి (పోస్టల్ డిపార్ట్మెంట్), గురుమూర్తి (సెంట్రల్ సర్వీస్), శ్రీనివాస్ (సర్వశిక్షా అభియాన్), జాస్తి కృష్ణకిశోర్ (తాళాలన్నీ ఇతడికే ఇచ్చారు కదా), వెంకటేశం (సమాచార కమిషనర్), రమణారెడ్డి (రైల్వే శాఖ).. వీరందరికీ ఇలాంటి పేర్లు ఏం పెట్టాలి? వీరంతా అనకొండలా లేక కొండచిలువలా? మేం ప్రశ్నిస్తున్నది సదుద్దేశంతోనే. అంతేగానీ అవహేళన చేయడానికి కాదు. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ దాడులు దేనికి నిదర్శనం? రాబోయే రోజుల్లో మీరే చింతించాలి. ప్రజలంతా గమనిస్తున్నారు.