గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Published Fri, Feb 21 2025 9:05 AM | Last Updated on Fri, Feb 21 2025 9:01 AM

గ్రామ

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

– మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

రామాపురం : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోక ఎంతో వెనుకబడి ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్డు, డ్రైనేజీ కాలువలు, వీధి లైట్లు ఏర్పాటు చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.

బాల్య వివాహంపై

ఏఎస్పీ విచారణ

పెనగలూరు : పెనగలూరు మండలం, ఈటమాపురం గ్రామానికి చెందిన ఓ బాల్య వివాహంపై ఏఎస్పీ మనోజ్‌ హెగ్డే గురువారం విచారణ చేపట్టారు. పోలీస్‌ స్టేషన్‌లో ఈ బాల్య వివాహంపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహం 2024లో జరిగినట్లు తెలిసింది. ఈ కేసుపై పూర్తి వివరాలు సేకరించాలని ఎస్‌ఐను ఆదేశించారు. అలాగే పోలీస్‌ స్టేషన్‌లో కేసుల పురోగతిపై ఆరా తీశారు. స్టేషన్‌లో రికార్డులను కూడా ఏఎస్పీ పరిశీలించారు. ముఖ్యంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట రూరల్‌ సీఐ రమణ, పెనగలూరు ఎస్‌ఐ రవిప్రకాష్‌ రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

గాలివీడు యువకుడి మృతి

గాలివీడు : తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లె పంచాయతీ కస్పాకు చెందిన షేక్‌ ఫకీర్‌ బాషా(21) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. షేక్‌ హిదాయతుల్లా, రషీదా దంపతుల ఇద్దరు సంతానంలో కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ఫకీర్‌ బాషా తిరుపతిలోని మోహన్‌ బాబు కాలేజీలో బి.ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం సహచర విద్యార్థినితో కలిసి ద్విచక్రవాహనంపై వివాహానికి వెళ్లి వస్తుండగా నాయుడుపేట– పూతలపట్టు ప్రధాన రహదారిలో టిప్పర్‌ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. చదువు పూర్తి చేసుకుని తమకు చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్న ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. చిన్నవయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయా అంటూ కుటుంబ సభ్యుల రోదనలతో బొరెడ్డిగారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
గ్రామాల అభివృద్ధికి  ప్రత్యేక చర్యలు 1
1/3

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

గ్రామాల అభివృద్ధికి  ప్రత్యేక చర్యలు 2
2/3

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

గ్రామాల అభివృద్ధికి  ప్రత్యేక చర్యలు 3
3/3

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement