వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బూత్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బూత్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌

Published Fri, Feb 21 2025 9:02 AM | Last Updated on Fri, Feb 21 2025 8:59 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బూత్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా

బాపట్ల టౌన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గానికి చెందిన దమ్ము పాల్‌ప్రవీణ్‌ను రాష్ట్ర బూత్‌ కమిటీ విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రవీణ్‌ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి సిఫార్సు మేరకు నియమించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తానని పేర్కొన్నారు.

అమరేశ్వరుని సేవలో మంత్రి సుభాష్‌

అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రం అమరావతిలోని శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ గురువారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికి దేవాలయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమపూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనం చేసి, స్వామివారి శేష వస్త్రంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సునీల్‌కుమార్‌, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కుంభమేళాకు ప్రత్యేక బస్సు

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌): భక్తుల కోరిక మేరకు ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు కుంభామేళాకు ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ స్పెషల్‌ హైటెక్‌ బస్సు బయలుదేరుంది. మొత్తం 8 రోజుల ప్రయాణంలో భాగంగా అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌, వారణాసి ప్రాంతాలను సందర్శించేలా ఈ సర్వీసుకు రూపకల్పన చేశారు. ఉదయం 10గంటలకు బస్సు బయలుదేరనుంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్‌ చేసుకోదలచిన వారు 91927 సర్వీస్‌ నంబర్‌ ద్వారా టిక్కెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో టికెట్‌ ధర రూ 8,300 నిర్ణయించారు. భోజనాలు, వసతి ఖర్చుల బాధ్యత ప్రయాణికులదే. మరిన్ని వివరాల కోసం 73828 97459, 73828 96403 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని అధికారులు తెలిపారు.

క్వారీ ప్రాంతాన్ని

పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

వీరనాయకునిపాలెం(చేబ్రోలు): గ్రామంలో జరిగిన మైనింగ్‌ జరిగిన ప్రాంతాన్ని తెనాలి సబ్‌ కలెక్టర్‌ సంజనా సింహ గురువారం పరిశీలించారు. గ్రామానికి చెందిన కొందరు అక్రమ క్వారీయింగ్‌పై గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామ పరిధిలో జరిగిన మైనింగ్‌పై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని రెవెన్యూ, మైనింగ్‌ శాఖాధికారులను కోర్టు ఆదేశించింది. గ్రామానికి చెందిన నిరుపేద దళితులకు 32 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం అందజేసింది. ఆ భూమిలో కొందరు నేతలు ఎటువంటి అనుమతులు లేకుండా క్వారీయింగ్‌ చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎంతమేర మైనింగ్‌ జరిగిందనే దానిపై రెవెన్యూ, సర్వేయర్లతో నివేదికను తయారు చేస్తున్నారు. దీనిపై సిబ్బందికి సబ్‌ కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. ఫిర్యాదు చేసిన గ్రామానికి చెందిన పలువురు సబ్‌ కలెక్టర్‌కు తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందజేశారు. తహసీల్దారు కె.శ్రీనివాసశర్మ, ఎస్‌ఐ డి.వెంకటకృష్ణ, మండల సర్వేయర్‌ సునీల్‌ పాల్గొన్నారు.

1,37,523 బస్తాల

మిర్చి విక్రయం

కొరిటెపాడు(గుంటూరు): మార్కెట్‌ యార్డుకు గురువారం 1,29,446 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 1,37,523 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 67,713 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బూత్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా 1
1/2

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బూత్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బూత్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా 2
2/2

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బూత్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement