
స్వర్ణలో ఏడుగురు జూదరుల అరెస్ట్
కారంచేడు: గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్న జూదరులను స్థానిక ఎస్ఐ వీ వెంకట్రావు తన సిబ్బందితో కలసి దాడి చేసి పట్టుకున్నారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని స్వర్ణ గ్రామంలోని చెరువుకట్ట మీద చెట్ల కింద పేకాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సాధారణ వ్యక్తుల మాదిరిగా వెళ్లి దాడి చేశారు. సాధారణ దుస్తుల్లో ఉండడంతో దగ్గరకు వచ్చే వరకు పోలీసులను జూదరులు గుర్తించలేకపోయారు. పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.4090 నగదు స్వాదీనం చేసుకున్నారు. జూదరులను కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్ఐ తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా పేకాట ఆతున్నట్లు తెలిస్తే మాకు సమాచారం అందించాలని ఆయన గ్రామస్తులను కోరారు.
హోటల్స్, లాడ్జిల్లో తనిఖీలు చేసిన పోలీసులు
బాపట్లటౌన్: లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని 75 హోటల్స్, లాడ్జిల్లో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ తుషార్డూడీ మాట్లాడుతూ నేరాలకు, బెట్టింగ్లకు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్న వారిని గుర్తించి, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసే ఉద్దేశంతో తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లాలోని 32 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 75 లాడ్జిలు, రిసార్ట్స్, హోటళ్లను పోలీసు అధికారులు తనిఖీ చేయడం జరిగిందన్నారు.
బైక్ అదుపు తప్పి ముగ్గురికి గాయాలు
కారంచేడు: చిలకలూరిపేటకు చెందిన ముగ్గురు యువకులు చీరాల సమీపంలోని వాడరేవు సముద్ర తీరంలో సేదతీరేందుకు ఆదివారం వచ్చారు. ఉదయం బీచ్లో సేదతీరి, మధ్యాహ్నం వరకు సముద్రంలో కేరింతలు కొట్టి తిరిగి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలోని కారంచేడు–చీరాల మధ్య చిన చట్టాల వద్ద కుక్క ఒకటి అడ్డురావడంతో ముగ్గురు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో ముగ్గురు రోడ్డుపై పడి గాయపడ్డారు. విషయం తెలిసిన ఎస్ఐ వీ వెంకట్రావు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు.
అగ్నిప్రమాదాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
– అగ్నిమాపక శాఖాధికారి వెంకటేశ్వరరావు
బాపట్లటౌన్: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 14 నుంచి జరుగుతున్న అగ్ని ప్రమాద వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ముగింపులో భాగంగా ఆర్టీసీ బస్టాండ్లు, కళాశాలల్లోని విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు అధికసంఖ్యలో జరిగే అవకాశం ఉందని, వాటి నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ విజయ్కుమార్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
నేడు ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష
జెట్టిపాలెం(రెంటచింతల):జెట్టిపాలెం ఆదర్శ పాఠశాల(ఏపీ మోడల్ స్కూల్)లో 6వ తరగతిలో ప్రవేశానికి 2025–2026 విద్యాసంవత్సరానికి మార్చి 31వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు సోమవారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె.పాపయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో పొందిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారని పేర్కొన్నారు. మార్చి నెల 31లోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 21 న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

స్వర్ణలో ఏడుగురు జూదరుల అరెస్ట్

స్వర్ణలో ఏడుగురు జూదరుల అరెస్ట్