ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీగా యూసీఈ | - | Sakshi
Sakshi News home page

ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీగా యూసీఈ

Published Tue, Apr 8 2025 10:51 AM | Last Updated on Tue, Apr 8 2025 10:51 AM

ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీగా యూసీఈ

ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీగా యూసీఈ

● అప్‌గ్రేడ్‌ చేస్తూ జీఓ జారీ చేసిన ప్రభుత్వం ● కొత్తగూడేనికి ప్రత్యేక గుర్తింపు ● అందుబాటులోకి కొత్త కోర్సులు

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెంలోని కాకతీయ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌(యూఈసీ – కేయూ)ను ఎర్త్‌ సైన్సెస్‌ విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీఓ జారీ చేసింది. ఈ కళాశాల దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉండగా 300 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. రాష్ట్ర విద్యార్థులు ఇన్నాళ్లూ ఎర్త్‌ సైన్సెస్‌ కోర్సు చదవాలంటే సెంట్రల్‌ యూని వర్సిటీలకు వెళ్లాల్సి వచ్చేది. కొత్తగూడెంలోనే ఈ కోర్సులు అందుబాటులోకి రానుండడంతో విద్యార్థుల ఇక్కట్లు తీరనున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే జిల్లా వాతావరణం కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎండ, వాన, చలి అన్నీ ఎక్కువే. ఇక అలాంటివాటిపై అధ్యయనం చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు సీఎంకు వినతులు ఇవ్వగా ఇప్పుడు ఆయన కృషి ఫలించినట్టయింది. సహజ వనరులు, మినరల్స్‌ ఉన్న కొత్తగూడెంలో యూనివర్సిటీ ఏర్పాటుతో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ జిల్లాకు మంజూరు కావడంతో విద్యార్థులు, అధ్యాపకులు సంబరాలు జరుపుకున్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం సింగరేణి, వివిధ కంపెనీల్లో పని చేస్తున్న వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికులకు ఉపాధి అవకాశాలు..

ఇంజనీరింగ్‌ కళాశాల విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్‌ కానుండగా అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వేల సంఖ్యలో యువ శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే దేశ భవిష్యత్‌కు బాటలు వేసే అవకాశం ఉంటుంది. ఎర్త్‌ సైన్సెస్‌ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లతో జిల్లాకు జాతీయస్థాయిలో పేరు రానుంది. ఈ యూనివర్సిటీలో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్‌, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్‌ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి పలు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్యా పెరగనుంది.

కేయూ నుంచి విడిపోనుంది..

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీని ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేయడంతో ఈ కాలేజీ కేయూ నుంచి విడిపోనుంది. 1978లో స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌గా ఓయూ పరిధి నుంచి కొత్తగూడెంలో పీజీ సెంటర్‌ ఏర్పాటైంది. తొలినాళ్లలో బీఈ మైనింగ్‌తో పాటు ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులు ఉండగా, కేయూ ఏర్పాట య్యాక 1996లో ఆ పరిధిలోకి చేర్చి కొత్తగూడెం మైనింగ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీగా మార్చారు. ఆ సమయాన ఈఈఈ, సీఎస్‌ఈ, 2010లో ఐటీ, ఈసీఈ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చినా మధ్యలో ఎమ్మెస్సీ జియాలజీ కోర్సు తొలగించా రు. ఇప్పుడు కేయూ నుంచి విడిపోతున్నందున బోధన, బోధనేతర పోస్టులే కాక కాలేజీ ఆస్తులన్నీ బదలాయిస్తారు. ఇంజనీరింగ్‌ కాలేజీలో 41 అధ్యాపకుల పోస్టులకు గాను ప్రస్తుతం 16మంది రెగ్యులర్‌, మిగతా వారు కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. 106 నాన్‌టీచింగ్‌ పోస్టులకు 60 మంది పనిచేస్తున్నారు. వర్సిటీగా అప్‌గ్రేడ్‌ కాగా పోస్టులు పెరిగే అవకాశముంది. ఇక ఈ కాలేజీలో నియామకమైన అసోసియేట్‌ ప్రొఫెసర్లు బిక్షాలు, వెంకటరమణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు రాధిక, సుమలత కేయూలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వీరి డిప్యూటేషన్లు రద్దు చేస్తారా, ఆప్షన్‌ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement