
ఓపెన్ బెంచ్ ప్రెస్ పోటీల్లో ప్రతిభ
మణుగూరు టౌన్: ఖమ్మంలో ఆదివారం జరిగిన రెండుజిల్లాల స్థాయి ఓపెన్ బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ పోటీల్లో మణుగూరు యువకుడు పర్శిక పాండురాజు ప్రతిభ చూపాడు. గోల్డ్మెడల్ కై వసం చేసుకున్నాడు. ఈ మేరకు జిమ్ ట్రైనర్ నాగరాజు సోమవారం వివరాలు వెల్లడించారు. పాండురాజు గతంలో కూడా రెండు బంగారు పతకాలు సాధించాడని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై నిరసన
తల్లాడ/ముదిగొండ: పదిహేను రోజుల క్రితం ధాన్యం కోతలు పూర్తిచేసి కల్లాల్లో ఆరబెట్టినా కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని రైతులు సోమవారం ఖాళీ పురుగు మందుల డబ్బాలతో నిరసన తెలిపారు. తల్లాడ మండలంలోని కిష్టాపురంలో ధాన్యం సిద్ధం చేసినా గన్నీ సంచులు ఇవ్వడం లేదని, వర్షానికి నష్టపోయే ప్రమాదముందని వారు వాపోయారు. అధికారుల తీరు మారకపోతే ఆత్మహత్య చేసుకుంటామని వెల్లడించగా.. అధికారులు తేమ శాతం తగ్గగానే కాంటా వేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే, ముదిగొండ మండలం గోకినేపల్లి రైతులు ఖమ్మం–కోదాడ రహదారిపై ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మూడు రోజులైనా కాంటా వేయకపోవడంతో అకాల వర్షానికి నష్టపోయామని తెలిపారు.
అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల ఆవిష్కరణ
కూసుమంచి/రఘునాథపాలెం: కూసుమంచి మండలంలోని రాజుపేట గ్రామంలో జై భీమ్ బహుజన సంఘం ఆధ్వర్యాన డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్రామ్ కాంస్య విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాలను సోమవారం రాజుపేట గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఆవిష్కరించి మాట్లాడారు. అంబేడ్కర్, జగ్జీవన్రామ్ త్యాగనిరతి, దేశానికి వారు అందించిన సేవలను కొనియాడారు. అలాగే, రఘునాథపా మండలం మంచుకొండలో అంబేడ్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అవిష్కరించారు. ఈకార్యక్రమంలో గుత్తా రవి, భూక్యా లక్ష్మణ్నాయక్, అజ్మీరా వీరునాయక్, మందా సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
తల్లి మందలించిందని ఆత్మహత్య
మధిర: వంట పని నేర్చుకోకపోతే ఎలా అని తల్లి మందలించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధిర శ్రీనగర్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. మధిరలోని కోల్డ్స్టోరేజీలో పనిచేసి యాదగిరికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఈక్షిత(24) వివాహం జరగగా ఆమె కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈనెల 16న ఈక్షిత కుమారుడికి అన్నప్రాసన ఉండడంతో వంట పని నేర్చుకోవాలని ఆమె తల్లి మందలించింది. దీంతో క్షణికావేశంలో గదిలోకి వెళ్లిన ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏదో పనిపై వెళ్లి ఉంటుందని భావించిన కుటుంబీకులు కాసేపటికి చూడగా తలుపు గడియ వేసినట్లు గమనించారు. దీంతో తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే ఈక్షిత మృతి చెందింది.
వడదెబ్బతో మేకల కాపరి మృతి
ఇల్లెందురూరల్ : మండలంలోని బోయితండా గ్రామపంచాయతీ లక్ష్మీనారాయణతండాకు చెందిన మేకల కాపరి బానోత్ హేమ్లా (55) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. మేకలను మేపేందుకు సోమవారం ఉదయం అడవికి వెళ్లిన హేమ్లా మధ్యాహ్నం ఇంటికి వచ్చాక సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. హేమ్లాకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

ఓపెన్ బెంచ్ ప్రెస్ పోటీల్లో ప్రతిభ

ఓపెన్ బెంచ్ ప్రెస్ పోటీల్లో ప్రతిభ

ఓపెన్ బెంచ్ ప్రెస్ పోటీల్లో ప్రతిభ