
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకు చెందిన వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వంతారా సరికొత్త ప్రచారం ప్రారంభించింది. ప్రతిఒక్కరూ ప్రకృతిని సంరక్షించాలని కోరింది. అందుకోసం అందరూ కృషి చేయాలని తెలియజేసేలా సినీ, క్రికెట్ ప్రముఖులతో ‘ఐయామ్ వంతారియన్’ పేరుతో ప్రత్యేక ప్రచారం మొదలుపెట్టింది. బుధవారం అందుకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది.
ప్రముఖ సినీ ప్రముఖులు అజయ్ దేవగణ్, భూమి పెడ్నేకర్, జాన్వీ కపూర్, వరుణ్ శర్మ, కుషా కపిల, క్రికెట్ ప్రముఖలు కేఎల్ రాహుల్తో సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో ఈ వీడియో రూపొందించారు. అందరూ పర్యావరణం పట్ల నిబద్ధత కలిగిఉండాలని వారు ఈ వీడియోలో కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని నొక్కిచెప్పారు. #IamAVantarian హ్యాష్ట్యాగ్తో చేపట్టిన ఈ వీడియో ప్రచారానికి భారీగా స్పందన వస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని గతంలో ప్రారంభించింది. గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటుచేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులోకోసం గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో 3వేల ఎకరాల్లో కృత్రిమ అడవిని ఏర్పాటుచేశారు.
ఇదీ చదవండి: బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..!
ఈ అడవిలో జంతువులు నివసించేందుకు వీలుగా సహజ వసతులు సిద్ధం చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే అదిపెద్ద ఆసుపత్రి ఉంది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, అధునాతన సదుపాయాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment