దాతృత్వంలో మేటి.. అజీం ప్రేమ్‌జీ!! | Azim Premji Tops Also In Charity | Sakshi

దాతృత్వంలో మేటి.. అజీం ప్రేమ్‌జీ!!

Nov 11 2020 4:43 AM | Updated on Nov 11 2020 4:50 AM

Azim Premji Tops Also In Charity - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ దాతృత్వంలోనూ మేటిగా నిల్చారు. రోజుకు సుమారు రూ. 22 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 7,904 కోట్లు విరాళమిచ్చారు. తద్వారా 2019–20 సంవత్సరానికి గాను హురున్‌ రిపోర్ట్‌ ఇండియా, ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌ రూపొందించిన దానశీలుర జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో  ప్రేమ్‌జీ రూ. 426 కోట్లు విరాళమిచ్చారు. ఇక తాజా లిస్టులో సుమారు రూ. 795 కోట్ల విరాళంతో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధినేత శివ నాడార్‌ రెండో స్థానంలో నిలవగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ రూ. 458 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో శివ నాడార్‌ రూ. 826 కోట్లు, అంబానీ రూ. 402 కోట్లు విరాళమిచ్చారు. కరోనా వైరస్‌ మహమ్మారి పరిణామాలతో కార్పొరేట్ల విరాళాల తీరు కొంత మారింది. 

కరోనాపై పోరాటానికి టాటా సన్స్‌ అత్యధికంగా రూ. 1,500 కోట్లు, ప్రేమ్‌జీ రూ. 1,125 కోట్లు ప్రకటించారు. కార్పొరేట్లు అత్యధిక మొత్తం విరాళాలను పీఎం–కేర్స్‌ ఫండ్‌కే ప్రకటించడం గమనార్హం. దీనికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ. 400 కోట్లు, టాటా గ్రూప్‌ రూ. 500 కోట్లు ప్రకటించాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం విరాళాల పరిమాణం సుమారు 175 శాతం పెరిగి రూ. 12,050 కోట్లకు పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది. రూ. 10 కోట్లకు మించి దానమిచి్చన వ్యక్తుల సంఖ్య స్వల్పంగా 72 నుంచి 78కి పెరిగింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకులు ముగ్గురు.. నందన్‌ నీలేకని (రూ. 159 కోట్లు), ఎస్‌ గోపాలకృష్ణన్‌ (రూ. 50 కోట్లు), ఎస్‌డీ శిబులాల్‌ (రూ. 32 కోట్లు) ఎడెల్‌గివ్‌ జాబితాలో ఉన్నారు.  

విద్యా రంగానికి ప్రాముఖ్యం.. 
విద్యారంగానికి అత్యధికంగా విరాళాలు అందాయి. ప్రేమ్‌జీ, నాడార్‌ల సారథ్యంలో సుమారు 90 మంది సంపన్నులు దాదాపు రూ. 9,324 కోట్లు ప్రకటించారు. ఆ తర్వాత స్థానంలో హెల్త్‌కేర్, విపత్తు నివారణ విభాగాలు ఉన్నాయి. భారీ విరాళాలు ఇచి్చన వారిలో అత్యధికంగా ముంబైకి చెందిన వారు 36 మంది ఉండగా, ఢిల్లీ వాసులు 20 మంది, బెంగళూరుకు చెందిన వారు 10 మంది ఉన్నారు. రూ. 5 కోట్లకు పైగా విరాళమిచి్చన 109 మంది సంపన్నులతో రూపొందించిన ఈ జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. మహిళల జాబితాలో నందన్‌ నీలేకని సతీమణి రోహిణి నీలేకని అత్యధికంగా రూ. 47 కోట్లు విరాళమిచ్చారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement