
ముంబై: అన్ని ముఖ్యమైన రంగాల్లో స్వల్పకాలంలో రుణాలకు డిమాండ్ అధికంగా ఉంటుందని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. వరుసగా రెండేళ్ల బలహీనత తర్వాత ఆహారేతర రుణాల వృద్ధి 2022–23లో 15 శాతానికి పైగా ఉంటుందని ఆర్బీఐ నిర్వహించిన బ్యాంక్ లెండింగ్ సర్వే వెల్లడించింది. సర్వే వివరాలను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసింది.
భవిష్యత్తు క్రెడిట్ డిమాండ్పై సీనియర్ లోన్ ఆఫీసర్ల అభిప్రాయాల ఆధారంగా ఆర్బీఐ ఈ వివరాలను రూపొందించింది. రుణాల్లో 90 శాతం వాటా కలిగి ఉన్న 30 వాణిజ్య బ్యాంకుల అధికారులను సర్వే చేసింది. కరోనా ప్రతికూలతల నుంచి ఇవి బయటకు వచ్చినట్టు ఆర్బీఐ నివేదిక తెలిపింది. రిటైల్/వ్యక్తిగత రుణాల్లో బ్యాంకుల మదింపు వేగంగా పుంజుకున్నట్టు పేర్కొంది.