![companies interested in Sabarimala pilgrims insurance scheme](/styles/webp/s3/article_images/2024/07/1/Sabarimala.jpg.webp?itok=t4n2CgM1)
శబరిమల ఆలయాన్ని సందర్శించే భక్తులకు బీమా కవరేజీని ప్రారంభించాలన్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రణాళికకు బీమా సంస్థల నుంచి సానుకూల స్పందన లభించింది. ఇటీవల కొన్ని బీమా కంపెనీలతో జరిగిన సమావేశాలు మార్కెట్ పై విలువైన అవగాహన కల్పించాయని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.
పోటీ, నిష్పాక్షిక ప్రక్రియ ద్వారా బీమా ప్రొవైడర్ను ఎంపిక చేస్తామని, ఇందులో భాగంగా కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను (ఈఓఐ) ఆహ్వానించనున్నట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. తక్కువ ప్రీమియంతో గరిష్ట ప్రయోజనాలు అందించే సంస్థను ఎంపిక చేస్తామన్నారు.
శబరిమల కొండపై నమోదవుతున్న మరణాల్లో ఎక్కువ శాతం గుండె ఆగిపోవడం, శ్వాసకోశ సమస్యలు వంటి ప్రమాదం కాని కారణాల వల్ల సంభవించినవేనని ఆయన పేర్కొన్నారు. గత సీజన్లోనే దాదాపు 55 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా యాత్రికులకు ప్రమాద మరణ బీమా కవరేజీని టీడీబీ కల్పిస్తోంది. అయితే, ప్రతి సంవత్సరం సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం ప్రమాదం కాని కారణాల వల్ల సంభవిస్తున్నాయి. దీంతో బాధిత కుటుంబాలకు పరిహారం అందడం లేదని ప్రశాంత్ చెప్పారు.
గత యాత్రల సీజన్ వరకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ భాగస్వామ్యంతో యాత్రికులకు బీమా కవరేజీని అందించేవారు. పరిమిత ప్రయోజనాలను అందించే పథకానికి బోర్డు వార్షిక ప్రీమియం చెల్లించేది. దీని ద్వారా శబరిమల కొండపై ప్రమాదవశాత్తు మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించేవారు.
గరిష్ట ప్రయోజనాలు
శబరిమల భక్తులు వర్చువల్ క్యూ విధానం ద్వారా దర్శనం బుక్ చేసేటప్పుడు రూ.10 వరకు వన్ టైమ్ ప్రీమియం చెల్లించి కవరేజీని ఎంచుకునే కొత్త బీమా పథకాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రవేశపెట్టబోతోంది. ఈ కొత్త పథకం కింద సుమారు రూ.5 లక్షల బీమా సౌకర్యంతోపాటు మెరుగైన ప్రయోజనాలు కల్పించాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment