భారత్‌ రెగ్యులేటర్లు.. భేష్‌ | Finance Minister Nirmala Sitharaman Hails Indian Regulators For World Class Performance | Sakshi
Sakshi News home page

భారత్‌ రెగ్యులేటర్లు.. భేష్‌

Published Wed, Oct 9 2024 3:48 AM | Last Updated on Wed, Oct 9 2024 7:58 AM

Finance Minister Nirmala Sitharaman Hails Indian Regulators For World Class Performance

ముంబై: భారత ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు అత్యుత్తమ రీతిలో ‘‘ప్రపంచ ప్రమాణాల స్థాయి’’ విధులు నిర్వహిస్తున్నాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశంసించారు. అలాగే వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి సైతం రెగ్యులేటర్లు కృషి చేస్తున్నాయని అన్నారు. కాగా రెగ్యులేటర్లను ప్రశ్నించడానికి లేదా విమర్శించడానికి తాను వ్యతిరేకం కాదని ఆమె ఆ సందర్భంగా ఉద్ఘాటింటారు. అయితే రెగ్యులేటర్లు నిర్వహిస్తున్న అత్యున్నత బాధ్యతలు, ఎకానమీ పురోభివృద్ధిలో సహకారం పట్ల కూడా ‘అత్యంత స్పృహ‘ కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఇక్కడ జరిగిన ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌బెస్ట్‌ బ్యాంక్స్‌ అవార్డుల కార్యక్రమంలో అన్నారు.

సెబీ విషయంలో బయటకు వస్తున్న వాస్తవాలను అందరూ పరిశీలించాలని కోరారు. సెబీ చైర్‌పర్సన్‌ మాధవీ పురి బుచ్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీతారామన్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ‘రెగ్యులేటర్లపై చర్యలు తీసుకోవాలని చర్చించే ముందు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను’’ అని సీతారామన్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడికి లోనుకావడం లేదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.  

డిజిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫారమ్‌లకు ధన్యవాదాలు  
బ్యాంకుల్లో పొదుపులు... పెట్టుబడుల్లోకి మారుతున్నాయన్న భయాలను ప్రస్తావిస్తూ, తక్కువ వడ్డీవచ్చే ఖాతాల వద్ద సౌకర్యవంతంగా కూర్చుండిపోకుండా, కొంత రిస్క్‌ తీసుకునిఎక్కువ రాబడులు పొందే వీలున్న మార్కెట్లలోకి మధ్యతరగతి భారతీయులు ప్రవేశించడానికి దోహదపడుతూ ‘‘గొప్ప సేవ’’చేస్తున్న డిజిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫారమ్‌లకు ధన్యవాదాలని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. 2014లో 2.31 కోట్లుగా ఉన్న డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య సెపె్టంబరు 2024 నాటికి 17.1 కోట్లకు పెరిగాయన్న గణాంకాలను కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

బ్యాంకుల పటిష్టత అటు ఎకానమీని ఇటు కుటుంబాల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేస్తుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వాటి లాభదాయకతను ప్రభావితం చేసే రుణ నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె బ్యాంకింగ్‌కు సూచించారు. సైబర్‌ సెక్యూరిటీ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని అన్నారు. పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు విద్యాపరంగా అర్హత కలిగి ఉన్నారని, అయితే పారిశ్రామిక అవసరాల గురించి వారికి పెద్దగా తెలియడం లేదని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement