
దేశీ మార్కెట్లో వరుసగా మూడు రోజులు లాభపడిన బంగారం, వెండి ధరలు తిరిగి వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ. 242 తక్కువగా రూ. 51,091 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 732 క్షీణించి రూ. 62,897 వద్ద కదులుతోంది.
ప్యాకేజీపై డౌట్స్
ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన భారీ ప్యాకేజీపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మళ్లీ విభేధాలు తలెత్తడంతో బంగారం, వెండి ధరలు డీలాపడ్డాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదిత స్టిములస్ను కొన్ని షరతులతో 2.2 ట్రిలియన్ డాలర్లకు పెంచమంటూ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ట్రంప్ సంసిద్ధతను వ్యక్తం చేసినప్పటికీ ఇతర రిపబ్లికన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మూడో రోజూ..
వరుసగా మూడో రోజు బుధవారం ఎంసీఎక్స్లో 10 గ్రాముల పసిడి రూ. 390 ఎగసి రూ. 51,333 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,454 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,915 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 441 లాభపడి రూ. 63,629 వద్ద నిలిచింది. ఒక దశలో 64,070 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 63,115 వరకూ క్షీణించింది.
కామెక్స్లో..
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.7 శాతం వెనకడుగుతో 1,916 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.55 శాతం క్షీణించి 1,914 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి మరింత అధికంగా 1.5 శాతం నష్టపోయి ఔన్స్ 24.89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.