
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 342 పాయింట్లు ఎగసి 39,039 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఓవైపు డైరీ ఉత్పత్తుల కంపెనీ హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ కౌంటర్ జోరందుకోగా.. మరోపక్క ఆటో విడిభాగాల సుప్రజిత్ ఇంజినీరింగ్ కౌంటర్కూ డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్
వాటాదారులకు బోనస్ షేర్ల జారీ ప్రతిపాదనపై చర్చించేందుకు బోర్డు ఈ నెల 19న సమావేశంకానున్నట్లు హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ తాజాగా తెలియజేసింది. అంతేకాకుండా నిధుల సమీకరణ ప్రణాళికలపైనా నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ షేరు 8 శాతం జంప్చేసి రూ. 840 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 12 శాతం దూసుకెళ్లి రూ. 868 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
సుప్రజిత్ ఇంజినీరింగ్
ఈ ఏడాది(2020-21) రెండో త్రైమాసికంలో అమ్మకాలు 15 శాతం ఎగసి రూ. 450 కోట్లను తాకినట్లు సుప్రజిత్ ఇంజినీరింగ్ తెలియజేసింది. ఇవి క్యూ2లో సరికొత్త రికార్డ్గా పేర్కొంది. కోవిడ్-19లోనూ ప్రొడక్టులకు డిమాండ్ పెరిగినట్లు తెలియజేసింది. పండుగల సీజన్ నేపథ్యంలో మరో రెండు నెలలపాటు డిమాండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సుప్రజిత్ ఇంజినీరింగ్ షేరు 6 శాతం జంప్చేసి రూ. 200 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 10 శాతం దూసుకెళ్లి రూ. 207 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.