
యాపిల్ కంపెనీ తన కార్యకలాపాలను చైనా వెలుపల గణనీయంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే భారతదేశంలో ఉత్పత్తిని పెంచడానికి కావలసిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. చైనా దిగుమతులపై.. అమెరికా సుంకాలను పెంచితే, యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తిని మన దేశంలో రెట్టింపు చేసే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చైనీస్ దిగుమతులపై భారీ సుంకాలను విధించాలని నిర్ణయించుకుంటే యాపిల్ భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని ఏటా 30 బిలియన్లకు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం యాపిల్ ఇండియాలో సుమారు రూ. 1,30,000 కోట్ల నుంచి రూ. 1,36,000 కోట్ల విలువైన పరికరాలను తయారు చేస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల ప్రచారంలో చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 60 నుంచి 100 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ వెల్లడించారు. ఇదే నిజమైతే అమెరికా భారతదేశం మీద ఎక్కువ ఆధారపడి అవకాశం ఉంది. కాబట్టి యాపిల్ కంపెనీ కూడా తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. దీంతో కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయి.
గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా చైనా దిగుమతులపై సుంకాలను విధించారు. కాబట్టి ఇప్పుడు కూడా చైనా దిగుమతులపై సుంకాలను మరింత పెంచే అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్ తిరిగి రావడం ఇండో-అమెరికా సంబంధాలను మరింత ప్రభావితం చేయగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే భారతదేశంలో యాపిల్ ఐఫోన్ల తయారీ చాలా వేగంగా సాగుతోంది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఇండియా నుంచి సుమారు 6 బిలియన్ డాలర్ల (రూ. 50వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ. 85వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment