యూజర్‌ మాన్యువల్‌ మిస్సింగ్‌.. రూ.5 వేలు జరిమానా | OnePlus India fined Rs 5,000 for not providing a user manual to customer | Sakshi
Sakshi News home page

యూజర్‌ మాన్యువల్‌ మిస్సింగ్‌.. రూ.5 వేలు జరిమానా

Dec 9 2024 3:04 PM | Updated on Dec 9 2024 3:20 PM

OnePlus India fined Rs 5,000 for not providing a user manual to customer

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు బెంగళూరు వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్‌ రూ.5,000 జరిమానా విధించింది. కొత్తగా ఫోన్‌ కొనుగోలు చేసిన మొబైల్‌ ప్యాక్‌లో యూజర్‌ మాన్యువల్‌ రానందుకు కస్టమర్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. దాంతో విచారణ జరిపిన కమిషన్‌ ఇటీవల తీర్పునిచ్చింది.

బెంగళూరులోని సంజయ్‌ నగర్‌కు చెందిన ఎంస్‌ఎం రమేష్‌ అనే వినియోగదారుడు వన్‌ప్లస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన నార్డ్ సీఈ 3 మోడల్‌ ఫోన్‌ను కొనుగోలు చేశాడు. ఫోన్‌ విక్రయించిన ఆరు నెలల తర్వాత, జూన్‌లో వినియోగదారుల పరిష్కార వేదికకు ఫిర్యాదు చేశాడు. తాను రూ.24,598కి వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొన్నానని, అయితే అందులో యూజర్ మాన్యువల్‌ లేదని ఫిర్యాదులో తెలిపాడు. ఫోన్ వారంటీ సమాచారం, కంపెనీ చిరునామాను తెలుసుకోవడంలో తాను ఎంతో ఇబ్బంది పడ్డానని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి కంపెనీని ఫిర్యాదు చేసిన తర్వాత ఏప్రిల్‌లో వన్‌ప్లస్‌ మాన్యువల్‌ను అందించిందన్నారు. ఫోన్ కొనుగోలు చేసిన నాలుగు నెలల తర్వాత ‘సేవలో లోపం’ కారణంగా ఇలా చేయడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: పది పాసైన మహిళలకు ఎల్‌ఐసీ ఉపాధి అవకాశం

వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వన్‌ప్లస్ ఇండియా వ్యవహారం పూర్తిగా నిర్లక్ష్యం, ఉదాసీనతను చూపుతుందని పేర్కొంటూ రూ.5,000 జరిమానా విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement