
సాక్షి, ముంబై: అప్పుల సంక్షోభానికి తోడు, ఏజీఆర్ బకాయిల ఇబ్బందుల్లో ఉన్న టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియాకు మరో షాక్ తగిలింది. వివాదాస్పద రెడ్ఎక్స్ ప్లాన్లద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టించిందని ఆరోపణలతో టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ వోడాఫోన్ ఐడియాకు షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఇందులో అందిస్తున్న అఫర్లలో పారదర్శకత లేదని, నియంత్రణ సూత్రాలకు అనుగుణంగా లేదని ట్రాప్ ఆరోపించింది. ఈ ఉల్లంఘనపై చర్య ఎందుకు తీసుకోకూడదో "కారణం చూపించమని" సంస్థను కోరింది. ఆగస్టు 31 లోగా సమాధానం ఇవ్వాలని ట్రాయ్ ఆదేశించింది. అయితే ఇదే వివాదంలో భారతి ఎయిర్టెల్కు షోకాజ్ నోటీసు జారీ చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వొడాఫోన్ ఐడియా నెట్ స్పీడ్, ప్రియారిటీ కస్టమర్ కేర్ ఆఫర్లతో రెడ్ ఎక్స్ ప్లాన్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎయిర్టెల్ కూడా ప్లాటినం ప్లాన్లతో తన పోస్ట్పెయిడ్ వినియోగదారులకు ప్రీమియం సేవలను ఆఫర్ చేస్తోంది. ట్రాయ్ గతంలో ఇదే విషయంపై వోడాఫోన్ ఐడియాతోపాటు ఎయిర్టెల్ ను ప్రశ్నించింది. సంబంధిత డేటాను అందించమని కోరింది. దీంతో ఎయిర్టెల్ ఆ ప్లాన్లకు మార్పులు, చేర్పులు చేసింది. అయితే వోడాఫోన్ ఐడియా మాత్రం ఈ ప్లాన్ కొత్తది కాదంటూ ప్రతికూలంగా స్పందించడంతో వివాదం నెలకొంది.