
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తాజాగా రూ.10,000 కోట్లు సమీకరించింది. ఏడోసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ ద్వారా పెట్టుబడులు సమకూర్చుకుంది. 15 ఏళ్ల కాలపరిమితిగల వీటికి కూపన్ రేటు 7.23 శాతంకాగా.. రూ.11,500 కోట్లకుపైగా విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. నిజానికి బ్యాంక్ రూ.5,000 కోట్ల విలువైన బాండ్ల జారీకి తెరతీసింది. అధిక బిడ్డింగ్ నమోదైతే మరో రూ.5,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించేందుకు గ్రీన్షూ ఆప్షన్(ఓవర్ అలాట్మెంట్)ను ఎంచుకుంది. వెరసి బాండ్ ఇష్యూకి రెండు రెట్లు అధికంగా స్పందన లభించింది.
ఇదీ చదవండి: లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లు
బిడ్ చేసిన సంస్థలలో ప్రావిడెంట్ ఫండ్స్, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ తదితరాలున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల హౌసింగ్ విభాగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులుగా తాజా నిధులను వినియోగించనున్నట్లు వివరించింది. ఎస్బీఐ జారీ చేసిన బాండ్లకు స్థిరత్వ ఔట్లుక్సహా ఏఏఏ రేటింగ్ను పొందింది. వీటి జారీతో దీర్ఘకాలిక బాండ్లపై ఇతర బ్యాంకులు సైతం దృష్టి సారించేందుకు వీలు చిక్కినట్లు ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment