
సెక్యూరిటీస్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు మెరుగైన, సరైన సమాచారం లభించేలా చూడటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పర్ఫార్మెన్స్ వేలిడేషన్ ఏజెన్సీ (పీవీఏ), డేటా బెంచ్మార్కింగ్ ఇన్స్టిట్యూషన్ (డీబీఐ) అనే రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.
ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు (ఐఏ), రీసెర్చ్ అనలిస్టులు (ఆర్ఏ), ఆల్గోరిథం ప్రొవైడర్లు తాము అందించే సర్వీసుల పనితీరుకు సంబంధించి తెలియజేసే వివరాలను పీవీఏ నిర్ధారిస్తుంది. ఇక, వివిధ అసెట్ క్లాస్లకు సంబంధించి ప్రామాణికంగా ఉన్న, పోల్చి చూసుకోతగిన డేటాను అందించే సెంట్రల్ రిపాజిటరీగా డీబీఏ పని చేస్తుంది. 2023–24 వార్షిక నివేదికలో సెబీ ఈ విషయాలు వెల్లడించింది. మరోవైపు, ఇన్వెస్టర్లు చెల్లించే ఫీజులు కచ్చితంగా రిజిస్టర్డ్ ఐఏలు, ఆర్ఏలకే అందే విధంగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సెబీ పేర్కొంది.
ఇదీ చదవండి: అంతర్జాతీయ పరిణామాలు కీలకం
అన్రిజిస్టర్డ్ సంస్థలను ఇన్వెస్టర్లు గుర్తించేందుకు, వాటికి దూరంగా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడగలదని సెబీ తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగానికి పెట్టుబడుల లభ్యతకు తోడ్పడే విధానాలపై దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. ఈ విషయంలో మార్కెట్ వర్గాల అవసరాలను తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్), ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల (ఇన్వీట్స్) కోసం అడ్వైజరీ కమిటీ వేస్తున్నట్లు పేర్కొంది. వీటితో పాటు స్వచ్ఛంద డీలిస్టింగ్ నిబంధనలను సమీక్షించడం తదితర చర్యలు కూడా తీసుకోనున్నట్లు సెబీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment