
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీ సంచలనం సృష్టించింది. ఇన్వెస్కో నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్లో భారీ నిధులను సేకరించి భారత్లోని మరో డెకాకార్న్ స్టార్టప్గా స్విగ్గీ అవతరించింది.
700 మిలియన్ డాలర్లతో..డెకాక్లబ్లోకి..
ఇన్వెస్కో నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్లో ఇన్వెస్టర్ల నుంచి సుమారు 700 మిలియన్ డాలర్లను స్విగ్గీ సేకరించింది. దీంతో డెకాకార్న్ స్టార్టప్(10 బిలియన్ డాలర్) క్లబ్లోకి స్విగ్గీ చేరింది. ఈ ఫండింగ్ రౌండ్లో బరోన్ క్యాపిటల్ గ్రూప్, సుమేరు వెంచర్, ఐఐఎఫ్ఎల్ ఏఎంసీ లేట్ స్టేజ్ టెక్ ఫండ్, కోటక్, యాక్సిస్ గ్రోత్ అవెన్యూస్ ఏఐఎఫ్-1, సిక్సిటింత్ స్ట్రీట్ క్యాపిటల్, ఘిశాలో, స్మైల్ గ్రూప్, సెగంటీ క్యాపిటల్ సంస్థలు పాల్గొన్నాయి. ఇప్పటికే స్విగ్గీకి ఇన్వెస్టర్లుగా ఉన్న అల్ఫా వేవ్ గ్లోబల్, ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సంస్థలు కూడా ఈ రౌండ్లో పాల్గొన్నాయి. ఇప్పటివరకు భారత స్టార్టప్స్లో పేటీఎం, ఓయో, బైజూస్ తరువాత స్విగ్గీ డెకాకార్న్ స్టార్టప్గా అవతరించింది.
కింగ్ మేకర్ అయ్యేందుకు రెడీ..!
భారత్లోని ప్రముఖ నగరాల్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను స్విగ్గీ అందించిన విషయం తెలిసిందే. ఫుడ్ డెలివరీ సేవలతో పాటుగా గ్రాసరీ సేవలను ‘స్విగ్గీ ఇన్స్టామార్ట్’ ద్వారా మరింత విస్తృతపరిచేందుకు స్విగ్గీ సిద్దమైంది. తాజాగా సేకరించిన 700 మిలియన్ డాలర్లతో ఇన్స్టామార్ట్ సేవలపై మరింత దృష్టిసారించనుంది. ఆన్లైన్ గ్రాసరీ సేవల్లో కింగ్మేకర్ అయ్యేందుకు కంపెనీ భారీ ప్రణాళికలను రచిస్తోంది. దేశవ్యాప్తంగా 19 నగరాల్లో స్విగ్గీ ఇన్స్టామార్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే మూడు త్రైమాసికాల్లో వార్షిక స్థూల సరుకుల విలువ 1 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని కంపెనీ తెలిపింది. 100 మిలియన్ల మంది వినియోగదారులు నెలకు 15 సార్లు ఉపయోగించగలిగే ప్లాట్ఫారమ్గా స్విగ్గీని మార్చడమే మా లక్ష్యమని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీహర్ష మెజెటీ ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: 300 బిలియన్ డాలర్లకు చేరుకొనున్న దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ!