
న్యూఢిల్లీ: వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరతలకు సంబంధించి తాజా గణాంకాలు ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థను అధ్వాన్నంగా ఉన్నాయని సూచిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎక్కువ కాలం అధిక వడ్డీ రేట్ల వ్యవస్థ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని కూడా పేర్కొన్నారు. ఫిక్స్డ్ ఇన్కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఫిమ్డా), ప్రైమరీ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (పీడీఏఐ) వార్షిక సమావేశం శుక్రవారం దుబాయ్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
► అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ ఒడిదుడుకులను భారత్ తట్టుకుని నిలబడగలుగుతోంది.
► దేశంలో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్లోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు ఎకానమీ పటిష్టతను సూచిస్తున్నాయి.
► మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా, స్థిరంగా ఉంది. బ్యాంకులు, కార్పొరేట్లు సంక్షోభానికి ముందు కంటే మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. బ్యాంక్ రుణం రెండంకెలలో పెరుగుతోంది. ఒక చీకటి ప్రపంచంలో మనం ఒక ప్రకాశవంతమైన ప్రదేశాన్ని చూస్తున్నాము. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్, డిసెంబర్లలో అదుపులోనికి వచ్చింది.
► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అనిశ్చితితో ఉన్నప్పటికీ, ఆర్థిక మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పటికీ, భౌగోళిక రాజకీయ పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతున్నప్పటికీ మనం ఆశావాదంతో, విశ్వాసంతో వాటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాము.