ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు | Atrocities against girls are increasing day by day | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు

Published Wed, Jul 17 2024 5:37 AM | Last Updated on Wed, Jul 17 2024 5:37 AM

Atrocities against girls are increasing day by day

గుంటూరు జిల్లాలో ఒకే రోజు రెండు ఘటనలు  

ప్రత్తిపాడు మండలంలో దళిత విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ లైంగికదాడి  

ఫిరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య  

విశాఖలోని హోటల్‌లో బంధించి ఏలూరుకు చెందిన దళిత బాలికపై లైంగిక దాడి 

ప్రత్తిపాడు/ఫిరంగిపురం/టి.నరసాపురం: బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో ఒకేరోజు రెండు కేసులు.. ఏలూరు జిల్లాలో ఓ కేసు నమోదైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు గ్రామానికి చెందిన దళిత బాలిక (13) నడింపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది. 

ఈ నెల 12న అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ గండికోట వెంకటేశ్వరరావు ఉరఫ్‌ వెంకట్‌ పాఠశాలకు సమీపంలోని పంట పొలాల్లోకి బాలికను తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసిన ఎస్‌ఐ రవీంద్ర వెంకట్‌పై పోక్సో యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వేధింపులతో బాలిక ఆత్మహత్య 
ఫిరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) ఇంటి వద్ద ఉంటుంది. ఈమెకు కొన్నాళ్ల కిందట బంధువుల అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక తన బంధువులతో ఫిరంగిపురం తిరునాళ్లకు వచ్చింది.

ఆ సమ­యంలో ఆ యువకుడు తన మిత్రులతో వెళ్లి బాలిక గురించి అసభ్యంగా మాట్లాడటంతో బాలిక తండ్రి యువ­కు­డిని మందలించాడు. ఆ యువకుడు మరికొంతమందితో ఆ గ్రామానికి వెళ్లి బాలిక తండ్రిపై దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగుమందు తాగింది. ఆమెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు బంధువులు తరలించగా..చికిత్సపొందుతూ ఆది­వారం రాత్రి మృతి చెందింది. 

బాలిక తండ్రి ఫిర్యా­దు మేరకు యువకుడితో పాటు మరికొంతమందిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, బాలికను వేధిస్తున్న యువకుడు ఆదివారం అర్థరాత్రి ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

హోటల్‌ గదిలో బంధించి లైంగిక దాడి
బాలికపై లైంగిక దాడికి పా­ల్ప­డిన ఘటనలో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు యువకులపై టి.నరసాపురం పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎస్‌ఐ దుర్గా మహేశ్వరరావు మంగళవారం మీడియాకు తెలిపారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలోని బొర్రంపాలేనికి చెందిన బాలిక (16) జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. 

ఈ నెల 6న బాలిక అదృశ్యం కావడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసు దర్యాప్తు దర్యాప్తు జరుగుతుండగానే బాలిక ఈ నెల 15న టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనపై లైంగిక దాడి జరిగిందని, దీనికి నలుగురు యువకులు బాధ్యులని చెప్పి ఫిర్యాదు చేసింది. దీంతో అదృశ్యం కేసును పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మార్పు చేశారు. 

ఆమె ఫిర్యాదు వివరాలను పోలీసులు వెల్లడిస్తూ.. బాలిక హైసూ్కల్‌లో చదువుతున్న సమయంలోనే గ్రామానికి చెందిన యువకుడు (20) ప్రేమిస్తున్నానని వెంటపడుతూ ఆమెను వేధించేవాడని తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను జంగారెడ్డిగూడెంలోని ఓ హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. ఆ హాస్టల్‌ నుంచే బాలిక ప్రైవేట్‌ కళాశాలలో విద్యను అభ్యసిస్తోంది. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బాలిక ఈ నెల 6 నుంచి కనిపించలేదు. 

ప్రేమిస్తున్నానన్న యువకుడికి మరో ముగ్గురు యువకులు సహకరించడంతో..వారంతా కలిసి బాలికను కిడ్నాప్‌ చేసి విశాఖకు తీసుకువెళ్లారు. అక్కడ ఓ హోటల్‌ గదిలో బాలికను బంధించిన యువకుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి 
పాల్పడ్డాడు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement