
విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త కూడా అరెస్టు
ఇద్దరినీ కోర్టులో హాజరుపరచిన పోలీసులు
విచారణ పేరుతో ఎనిమిది గంటలపాటు వేధింపులు
సురేష్ కు మద్దతుగా స్టేషన్కు తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు
కక్ష సాధింపులో భాగంగానే అక్రమ అరెస్టు
అక్రమ అరెస్ట్కు భయపడేది లేదు: సురేష్ సతీమణి బేబీలత
సాక్షి, అమరావతి/మంగళగిరి : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను బుధవారం అర్థరాత్రి దాటాక హైదరాబాద్లో అరెస్టుచేసిన పోలీసులు ఆయనను గురువారం ఉ.8.30 గంటలకు మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్కు తీసుకొచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుచేసిన పోలీసులు స్టేషన్లో ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈయనతోపాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసులరెడ్డిని కూడా అరెస్టుచేసిన మంగళగిరి రూరల్ పోలీసులు వీరిద్దరినీ మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు.
న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం వీరిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. అక్రమ కేసులతో తమను అడ్డుకోలేరని, 2029లో చంద్రబాబుకు బుద్ధిచెప్పి తీరుతామన్నారు. కక్షతోనే తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందిపెడుతున్నారని.. ప్రజలు, దేవుడు చూస్తున్నారని చెబుతూ జై జగన్ అంటూ నినదించారు. అంతకుముందు.. స్టేషన్ వద్ద సురేష్ సతీమణి బేబీలత మాట్లాడుతూ.. తన భర్తపై చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టారన్నారు.
కేసులతో తమను భయపెట్టలేరని, 2019కు ముందు పొలాల దగ్థం కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని అప్పట్లో తన భర్తపై టీడీపీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా లొంగలేదని.. ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడేదిలేదని స్పష్టంచేశారు. ఇక సురే‹Ùను అరెస్టుచేశారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్బాబు, వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, నవరత్నాల అమలు కమిటీ మాజీ చైర్మన్ నారాయణమూర్తి, గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాలవజ్ర బాబు, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కమ్మూరి కనకారావు తదితరులతో పాటు కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకుని ఆయనకు మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment