
డ్రోన్లతో వ్యవసాయం చేస్తున్న సంగారెడ్డి జిల్లా
ఎస్హెచ్జీ మహిళలకు ప్రధాని ప్రశంసలు
సాంకేతికత, సంకల్పం కలిస్తే మార్పు వస్తుందని
నిరూపించారంటూ ‘మన్ కీ బాత్’లో కితాబు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డ్రోన్ల సాయంతో వ్యవసాయ పనులు చేస్తున్న సంగారెడ్డి జిల్లాలోని 54 మంది స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం నిర్వహించిన మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో వారి ప్రతిభను కొనియాడారు. ‘వారు డ్రోన్ ఆపరేటర్లు కాదు.. స్కై వారియర్లు’అంటూ ప్రధాని అభివర్ణించారు. ‘పొలాలతోపాటు ఆకాశపు ఎత్తుల్లో కూడా పనిచేస్తున్న అనేక మంది మహిళలు ఈ రోజుల్లో ఉన్నారు. ఇప్పుడు గ్రామీణ మహిళలు డ్రోన్ దీదీలుగా మారి డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నారు.
వారు వ్యవసాయంలో కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కొంతకాలం కిందటి వరకు ఇతరులపై ఆధారపడిన మహిళలు ఇ ప్పుడు స్వయంగా డ్రోన్ల ద్వారా 50 ఎకరాల భూమిలో మందులు పిచికారీ చేస్తున్నారు. ఉదయం మూడు గంటలు, సా యంత్రం రెండు గంటలు పనిచేస్తున్నారు. అంతే పని పూ ర్తయిపోతుంది. ఎండ వేడి లేదు. విషపూరిత రసాయనాల ప్రమాదం లేదు. గ్రామస్తులు కూడా ఈ మార్పును మన స్ఫూర్తిగా అంగీకరించారు. ఇప్పుడు మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా కాదు, స్కైవారియర్లుగా గుర్తింపు పొందారు. సాంకేతికత, సంకల్పం కలిసి నడిచినప్పుడు మార్పు వస్తుందని ఈ మహిళలు నిరూపిస్తున్నారు’అని మోదీ ప్రశంసించారు.
సబ్సిడీపై డ్రోన్లు.. శిక్షణ అందించి..
సంగారెడ్డి జిల్లా ఆందోల్ ప్రాంతానికి చెందిన 54 మంది ఎస్హెచ్జీ మహిళలను కేంద్రం అమలు చేస్తున్న నమో డ్రోన్ దీదీ పథకానికి ఎంపిక చేసింది. వారికి బెంగళూరుకు చెందిన ఫ్లైయింగ్ వెడ్జ్ అనే సంస్థ ఆధ్వర్యంలో డ్రోన్లను ఎగరేయడంలో శిక్షణ ఇప్పించింది. అలాగే ఈ పథకం కింద 80% సబ్సిడీపై డ్రోన్లను అందించింది. కేంద్ర సాయంతో రూ. 10 లక్షల వ్యయంతో ఎస్హెచ్జీ మహిళలు యూనిట్ను ప్రారంభించారు.
ఇందులో లబ్ధిదారులు 20% (రూ.2 లక్షలు) చెల్లించగా మిగిలిన 80% రూ. 8 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమో దీదీ, కిసాన్ దీదీ పథకాల కింద సబ్సిడీ ఇస్తున్నాయి. డ్రోన్ సేవలను మహిళలు వారి పొలాల వద్ద వినియోగించడంతోపాటు ఇతర రైతుల పొలాల వద్ద సేవలందిస్తున్నారు. ఇందుకోసం వారు రైతుల నుంచి నిర్ణిత మొత్తాన్ని తీసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. డ్రోన్ దీదీల సాయంతో రైతులకు సైతం పొలాల్లో పురుగుమందుల పిచికారీ చేసేందుకు కూలీల కొరత తప్పుతోంది.