అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించి అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని స్పాట్ వాల్యూయేషన్ సెంటరులో చరిత్ర, రసాయన శాస్తం జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం మొదలైంది. ఇప్పటికే ఈ సెంటరులో సంస్కృతం, తెలుగు, ఇంగ్లిషు, గణితం, పౌరశాస్త్రం, భౌతిక శాస్త్రం, అర్థ శాస్త్రాలకు సంబంధించిన జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియ కొనసాగుతోందని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. మరో మూడు పాఠ్యాంశాల జవాబు పత్రాలకు మూల్యాంకనం మొదలు కావాల్సి ఉందన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల మూల్యాంకనం జరుగుతోందని చెప్పారు. సోమవారం నుంచి మొదలైన రసాయన శాస్త్రంలో 21,001 జవాబు పత్రాలు, చరిత్రలో 993 జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతోందని వివరించారు. స్థానిక స్పాట్ వాల్యూయేషన్ సెంటరులో మూల్యాంకనం జాగ్రత్తలపై సంబంధిత అధికారులు, అధ్యాపకులతో సోమవారం మరోసారి డీఐఈవో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు పి.కర్ణారావు, వి.నాగలక్ష్మి, అడబాల శ్రీనివాస్, వై.లక్ష్మణరావు, చీఫ్ కోడింగ్ ఆఫీసర్ ఇ.సువర్ణకుమార్, స్పాట్ వాల్యూయేషన్లో విధులు నిర్వర్తిస్తున్న జిల్లాలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.
మంచినీళ్లు ఇవ్వాలని
మహిళల ధర్నా
అమలాపురం రూరల్: ఎన్నోఏళ్లుగా మంచినీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోపోవడంతో అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడికి చెందిన పరపేట గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వన్నె చింతలపూడి గ్రామంలో ఒక వాటర్ ట్యాంక్ నుంచి ఎక్కువ జనాభా ఉన్న 5 పేటలకు నీళ్లు ఇవ్వడంతో పరపేట ప్రజలకు నీళ్లు అందే పరిస్థితి లేదు. మంచినీళ్లు కావాలంటే 2 కిలోమీటర్లు దూరం వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం పరపేటలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ట్యాంక్ నిర్మాణం పూర్తి అయినా ప్రారంభోత్సవానికి నోచుకోని పరిస్థితి ఏర్పడడంతో మహిళలు కలెక్టర్ కార్యాలయం చేరుకుని మంచినీటి కష్టాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికై నా అధికారులు వాటర్ ట్యాంక్ ప్రారంభం చేయాలని, వేసవికాలం ప్రారంభం అవ్వడంతో మంచినీటి కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరమట దుర్గా భవాని, సీత మహాలక్ష్మి, విజయలక్ష్మి, కృష్ణ వేణి, వెరమ్మ్ర, చింతలమ్మా, సుందరి వేణి, చీకురుమెల్లి శ్రీదేవి, సకిలే అరుణ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ వైద్య మిత్రల ధర్నా
అమలాపురం రూరల్: ఎన్టీఆర్ వైద్య సేవలో వైద్య మిత్రల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఫీల్డ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని విధులకు వెళ్లకుండా ఆందోళన చేశారు. 17 సంవత్సరాల సర్వీసుని పరిగణనలోకి తీసుకొని ఫీల్డ్ సిబ్బందిని ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ వైద్య మిత్రలకు డీపీఓ కేడర్, ఆఫీస్ అసోసియేట్, టీమ్ లీడర్ల సమాన అర్హత కలిగిన కేడర్, జిల్లా మేనేజర్లకు డీవైఈవో కేడర్ అమలు చేసి కనీస వేతనం ఇవ్వాలని కోరారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియో, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలలో వెయిటేజ్ కల్పించాలని జేసీ నిషాంతిని కలసి వినతి పత్రం అందించారు. సంఘం నాయకులు చీకట్ల వెంకయ్య నాయుడు, మచ్చా నరసింహరాజు, గోలకోటి సతీష్, కావూరి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
‘చరిత్ర, రసాయన’ జవాబు పత్రాల మూల్యాంకనం
‘చరిత్ర, రసాయన’ జవాబు పత్రాల మూల్యాంకనం