
శ్రీనివాసుడిని తాకిన సూర్యకిరణాలు
ద్వారకాతిరుమల: సాయం సంధ్య వేళ.. సూర్య భగవానుడి కిరణాలు గర్భాలయంలో కొలువైన శ్రీనివాసుడి అపాదమస్తకం స్ప్రుశించే శుభ సమయంలో.. వీక్షించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగారు. ఏటా చైత్ర మాసం ముందు, లేదా చైత్ర మాసం ప్రారంభం రోజుల్లో సాక్షాత్కరించే ఈ అరుదైన ఘట్టం శ్రీవారి క్షేత్ర ఉపాలయంగా విరాజిల్లుతోన్న లక్ష్మీపురంలోని పురాతన దేవాలయమైన, శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఆవిష్కృతమైంది. ఎక్కడా ఏ ఆలయంలోను లేని విధంగా ఇక్కడ సూర్యకిరణాలు నేరుగా స్వామి, అమ్మవార్లను తాకడం ఒక విశిష్ఠత. ఆలయంలోని గర్భాలయంలోకి నేరుగా సూర్యకిరణాలు ప్రవేశించి శ్రీవారిని అణువణువును అర్చించి వెళతాయి. ఆలయం ముందు చెట్లు, ధ్వజస్తంభం, పందిళ్లు ఇలా ఎన్ని ఉన్నా వాటిని తప్పించుకుని మరీ లోపలకు వెళ్లి స్వామిని అర్చించడం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసం ముందు, లేద చైత్ర మాసం ప్రారంభం రోజుల్లో, వరుసగా మూడు రోజులపాటు సాయంత్రం సూర్యాస్తమయ సమయాన అద్భుత కాంతులతో సూర్యకిరణాలు నేరుగా శ్రీ వేంకటేశ్వర స్వామి ముఖం మీద నుంచి నెమ్మదిగా కిందకు దిగుతూ పాదాల వరకు అర్చిస్తాయి. ఇలా అణువణువు అర్చిస్తూ దిగిన సూర్యకిరణాలు స్వామి పాదాల వద్ద ఉన్న ఉత్సవ మూర్తులను తాకిన అనంతరం, అవి రెండుగా చీలి ఇరుపక్కలా ఉన్న పద్మావతి, ఆండాళ్ అమ్మవార్ల ఆలయంలోకి ప్రవేశించి అమ్మవార్లను అర్చిస్తాయి. ఈ వింత ఏడాదిలో మూడు రోజులు మాత్రమే ఇక్కడ జరగడం విశేషమని అర్చకులు చెబుతున్నారు.
ఏటా 3 రోజులు ఆవిష్కృతమవుతున్న అద్భుత దృశ్యాలు