
మామిడికి అకాల నష్టం
నూజివీడు: ప్రకృతి ప్రకోపం మామిడి రైతుల ఆశలను వమ్ము చేసింది. అసలే కాపు తక్కువ ఉండి నష్టాల్లో ఉన్న రైతులను పెనుగాలుల రూపంలో ప్రకృతి మరింత అప్పుల్లోకి నెట్టేసింది. ఈనెల 7న సాయంత్రం ఈదురు గాలులు, అకాల వర్షం మామిడికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. నూజివీడు నియోజకవర్గంలో ప్రధాన వాణిజ్య పండ్ల తోటల్లో మామిడి ప్రాధాన్యమైంది. ఈ ఏడాది దాదాపు 80 శాతం దిగుబడి తగ్గి రైతులు దిగాలుగా ఉండగా.. పెనుగాలులు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టాయి. ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి దిగుబడి కోసం ఎదురుచూస్తున్న సమయంలో పంట వర్షార్పణం అయ్యింది.
15 శాతం వరకు పంటకు దెబ్బ
నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లో వీచిన ఈదురుగాలులకు మా మిడి కాయలు నేలపాలయ్యాయి. తోటల్లో దాదాపు 10 నుంచి 15 శాతం మామిడి కాయలు రాలిపోయా యి. చాట్రాయి మండలంలోని కొత్తగూడెం, యర్రావారిగూడెం, సి.గుడిపాడు, నరసింహరావుపాలెం, చిన్నంపేట తదితర గ్రామాల్లో, ముసునూరు మండలంలోని రమణక్కపేట, లోపూడి, సూరేపల్లి, బా స్వరప్పాడు గ్రామాల్లో ఈదురుగాలులు వీచాయి. రాలిన కాయలను విక్రయిద్దామన్నా ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో వాటిని పారబోయాల్సిన పరిస్థితి రైతులకు ఎదురైంది. చాట్రాయి మండలంలో 4,232 ఎకరాల విస్తీర్ణంలో మామిడి సాగు చే స్తుండగా సుమారు 30 టన్నుల కాయలు నేలరాలా యి. అలాగే ముసునూరు మండంలలో 3,100 ఎకరాల విస్తీర్ణంగా సాగు చేస్తుండగా సుమారు 15 టన్నుల కాయలు నేలరాలాయి.
పూతను కాపాడుకుంటే...
పూతను నిలుపుకునేందుకు 12 నుంచి 15 సార్లు పురుగు మందులను రైతులు పిచికారీ చేశారు. నల్లతామర పురుగు ఉధృతంగా ఉన్నప్పుడు కూడా పూతను కాపాడుకునేందుకు నానాపాట్లు పడ్డారు. పురుగు మందులు, తోట కాపలా, నీటితడులు కో సం వేలాది రూపాయలు ఖర్చు పెట్టామని, దిగుబడులు చేతికి వచ్చే సమయానికి పెనుగాలుల తాకిడికి కాయలు నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈదురుగాలులతో నేలరాలిన కాయలు
అకాల వర్షంతో అవస్థలు
లబోదిబోమంటున్న రైతులు
ప్రభుత్వం ఆదుకోవాలి
నాకు రెండెకరాల్లో మామిడి తోట ఉంది. ఇప్పటివరకు రూ. లక్షకు పైగా ఖర్చుచేశా. పూత వచ్చి పిందెలు ఏర్పడ్డాయని సంతోషించే లోపు ఈదురుగాలులకు కాయలు రాలిపోయాయి. దీంతో దాదాపు రూ.40 వేల నష్టం వాటిల్లింది. మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– మందపాటి రఘుపతిరెడ్డి, రైతు, సి.గుడిపాడు, చాట్రాయి మండలం
తీవ్రంగా నష్టపోయాం
నాకు పది ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. రూ.10 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. ఈదురుగాలులు, వర్షానికి మామిడి కాయలు రాలిపోయి తీవ్రంగా నష్టం వాటిల్లింది. పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.
– కొండా వెంకట్రావు, రైతు, రమణక్కపేట, ముసునూరు మండలం

మామిడికి అకాల నష్టం

మామిడికి అకాల నష్టం