
రెండు చేతులతో సంపాదించే వాళ్లను చూశాం కానీ.. రెండు చేతులతో రాసేపిల్లల్ని చూడాలంటే మధ్యప్రదేశ్ వెళ్లాల్సిందే. సింగ్రౌలీ జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలోని బుధేలా గ్రామంలో వీణావాదిని పబ్లిక్ స్కూల్ ఉంది. 1999 జూలై 8న ఈ పాఠశాలను స్థాపించారు. ఇక్కడి విద్యార్థుల ప్రత్యేకత ఏమిటంటే ఒకేసారి ఐదు భాషల్లో రెండు చేతులను ఉపయోగించి రాయగలరు.
ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ ద్విచేతి విద్యలో ఆరితేరారు. హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ, స్పానిష్ భాషల్లోప్రావీణ్యులు. అలాంటి శిక్షణ పొంది ఇప్పటివరకు 500 మందికి పైగా ఉత్తీర్ణత సాధించారు.. ఇది భారతదేశంలోనే తొలి సవ్యసాచి పాఠశాలగా గుర్తింపు పొందింది.
మహాత్మాగాంధీ, మదర్ థెరిస్సా, ఆల్బర్ట్ ఐన్ స్టీన్, రతన్ టాటా, బిల్గేట్స్, సచిన్ టెండుల్కర్, బరాక్ ఒబామా వంటి ప్రముఖులు ఎడమ చేత్తో రాసేవారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రెండు చేతులతో రాయగల నేర్పరి. ఆయన స్ఫూర్తితో తమ విద్యార్థులకు ఈ సృజనను నేర్పినట్లు ప్రిన్సిపాల్ వృంగద్ శర్మ అంటారు. తొలుత సైనికుడిగా ఉన్న ఆయన రాజీనామా చేసి ద్విచేతి విద్యలో శిక్షణ పొందారు.
అప్పుడే ఈ పాఠశాలను నెలకొల్పి చిన్న వయసు విద్యార్థులకు రెండు చేతులతో రాయడం నేర్పించడంప్రారంభించారు. నిరంతర సాధనతో ఈ పాఠశాల విద్యార్థులు కేవలం 11 గంటల్లో 24 వేల పదాలు రాయగలరు. రెండు చేతులతో రాయడం వల్ల గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. దీన్ని ఆధ్యాత్మిక సాధనగా ఆయన అభివర్ణించారు. యోగ, ధ్యానం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అందుకే రోజూ గంట సేపు స్కూల్లో వీటిని సాధన
చేయిస్తారు.
అనువాద బ్రహ్మలు
విద్యార్థులు ఒకటి నుంచి 100 పదాలు ఉర్దూలో 45 సెకన్లు, రోమన్ లో ఒక నిమిషంలో, దేవనాగరి లిపి ఒక నిమిషంలో రాయగలరు. ఒక నిమిషంలో రెండు భాషల నుంచి 250 పదాలను అనువదించగలరు. నిమిషంలో 17 పదాల వరకు రాయగలరు. వారికి ఒక చేత్తో రెండు పదాల పట్టికను, మరో చేత్తో మూడు పదాల పట్టికను రాస్తే సత్తా ఉంది.
కొంతమంది పిల్లలను పలకరించినప్పుడు వారు తమ అనుభవాలను పంచుకున్నారు. మూడోతరగతిలో ఉన్నప్పుడు కుడిచేత్తోనే రాసేవారట. తర్వాత ఎడమచేతి వాటం నేర్చుకున్నారు. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఒకేసారి రెండు చేతులతో.. అది కూడా ఐదు భాషలను మార్చి మార్చి రాసేప్రావీణ్యతను సంపాదించినట్లు చె΄్పారు. మానవ మెదడు రెండు భాగాలుగా విభజించి ఉంటుంది. ఆ రెండింటినీ ఒకేసారి ఉపయోగించగలిగేలా ఉపాధ్యాయులు పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అందుకే ఏకకాలంలో రెండు చేతులతో రాయగలరని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.
– చెన్నాప్రగడ శర్మ