
గుజరాత్లోని జామ్నగర్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 28 ఏళ్ల పైలట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ చనిపోయిన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయనకు కొద్దిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది, మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన తమ కుమారుడు ఇలా అర్థాంతరంగా చనిపోవడంతో పైలట్ కుటుంబంలో విషాదం నెలకొంది.
జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో సిద్ధార్థ్ యాదవ్ అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా సిద్ధార్థ్ కో-పైలట్ ఇతరులు ప్రాణాలను కాపాడిన తీరు పలువురి చేత కంట తడిపెట్టించింది. అపారమైన ధైర్యం, త్యాగం ఎన్నటికీ మరువ లేమంటూ పలువురు ఆయనకు నివాళి అర్పించారు.
గత నెలలో (మార్చి 23) సిద్ధార్థకు నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న అతని వివాహం జరిపించేందుకు కుటుంబం సన్నద్ధమవుతుండగా, ప్రాణాలు కోల్పోవడం షాక్కు గురి చేసింది. గుజరాత్లోని సువర్ద గ్రామంలో జామ్నగర్ నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే సిద్ధార్థ్ అతి క్లిష్టమైన సమయంలో అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించి, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం నుండి జెట్ను పక్కను మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం కూలిపోయిన తర్వాత మంటలు చెలరేగాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన కో-పైలట్ మనోజ్ కుమార్ సింగ్ చికిత్స పొందుతున్నాడు.
హర్యానిలోని రేవారిలోని భల్ఖి-మజ్రా గ్రామానికి సుశీల్ యాదవ, నీలం దంపతుల ఏకైక సంతానం సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఫైటర్ పైలట్గా శిక్షణ పూర్తి చేసి 2016లో NDA పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత భారత వైమానిక దళంలో చేరారు. రెండేళ్లలోపు, అతను ఫ్లైట్ లెఫ్టినెంట్గా పదోన్నతి పొందాడు. అతని మరణ వార్త అతని కుటుంబంలోని ప్రతి ఒక్కరితోపాటు రేవారీ వాసులను కూడా తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.
చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?
రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి, ప్రస్తుతం LICలో పనిచేస్తున్న సుశీల్ యాదవ్ తన కొడుకు ధైర్యాన్ని తనకు గర్వకారణంగా అభివర్ణించారు. సిద్ధార్థ్ భౌతికకాయానికి ఆయన స్వస్థలంలో పూర్తి సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా సిద్ధార్థ్ ముత్తాత కూడా బ్రిటిష్ కాలంలో బెంగాల్ ఇంజనీర్లలో పనిచేశారు. మరోవైపు, అతని తాత పారామిలిటరీ దళాలలో సభ్యుడు. అతని తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు.