తిరుపతమ్మకు బంగారు నెక్లెస్ బహూకరణ
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారికి శుక్రవారం తెనాలికి చెందిన లంక శ్రీనివాసరావు, రత్నజ్యోతి దంపతులు 20 గ్రాముల బంగారు నెక్లెస్, 135 గ్రాముల వెండి గిన్నెను ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు.
జీజీహెచ్లో ‘మీకోసం మేము’
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్కు వచ్చే రోగుల సమస్యలను తెలుసుకుని తక్షణమే వారి సమస్యలు పరిష్కరించేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ ‘మీకోసం మేము’ నూతన కార్యక్రమాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. డాక్టర్లు, రోగుల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి త్వరితగతిన రోగులకు చికిత్స అందించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రోగుల బంధువులతో సూపరింటెండెంట్, సంబంధిత వైద్యులు మాట్లాడి రోగులు, వారి బంధువుల సమస్యలు తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటారన్నారు. రోగులు ఆస్పత్రిలో పాటించవలసిన నియమ నిబంధనలు, వారి బంధువులు పాటించవలసిన నియమాలు వివరించారు. ఆస్పత్రిని శుభ్రంగా ఉంచేందుకు పాటించవలసిన పద్ధతులు తదితరవాటి గురించి వివరించారు. కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులు, రోగి బంధువులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలి రోజు రోగుల సమస్యలను సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు.
1,14,723 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,01,695 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,14,723 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,600 నుంచి రూ.14,200 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 54,685 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.
ఘనంగా శోభాయాత్ర
మాచర్ల: పట్టణంలో శుక్రవారం గాయత్రి మహాయజ్ఞం కనులపండువగా నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 500 మంది శోభాయాత్రలో పాల్గొన్నారు. తొలుత కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశాక కలశాలతో ముందుకు సాగారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి వెళ్లి గాయత్రీ మహా యజ్ఞంలో పాల్గొన్నారు. భారీగా దీప యజ్ఞం నిర్వహించారు. అఖిల విశ్వ గాయత్రీ పరివార్ శాంతికుంజ్ హరిద్వార్, మాచర్ల శాఖ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటైంది. సీఐ ప్రభాకర్రావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
తిరుపతమ్మకు బంగారు నెక్లెస్ బహూకరణ
తిరుపతమ్మకు బంగారు నెక్లెస్ బహూకరణ
తిరుపతమ్మకు బంగారు నెక్లెస్ బహూకరణ
Comments
Please login to add a commentAdd a comment