
రాష్ట్ర సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఈనెల 13, 14 తేదీల్లో విజయవాడలో జరగనున్న ఏపీ స్టేట్ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు వీఎస్ఎస్ లలిత్, ఎస్.చరణ్ కుమార్, వి.హర్షిణి ఎంపికయ్యారని టెన్నిస్ కోచ్ జీవీఎస్ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ ఆధారంగా వీరిని ఎంపిక చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర పోటీల్లోనూ పతకాలు తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మిర్చి యార్డుకు
వరుస సెలవులు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శనివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. శని, ఆదివారాలు యార్డుకు సాధారణ సెలవులు, సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవం పురస్కరించుకుని సెలవు ఇచ్చారు. దీంతో యార్డుకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించినట్టు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో రైతులు తమ సరుకును తీసుకురావద్దని కోరారు. సోమవారం అర్ధరాత్రి నుంచి రైతుల సరుకును యార్డులోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. మంగళవారం యథావిథిగా యార్డులో క్రయవిక్రయాలు కొనసాగుతాయని ఆమె వివరించారు.
నేడు టీచర్ బదిలీలు,
ఉద్యోగోన్నతులపై అవగాహన
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులు, సీనియార్టీ జాబితాలపై శనివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కోర్టు ఎదుట ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవ లింగారావు, మొహ్మద్ ఖాలీద్ శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు. ఏపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద్, ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకుడు షేక్ జిలానీ పాల్గొని ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తారని వివరించారు.
డ్రోన్ల వినియోగంతో సమయం ఆదా
కొరిటెపాడు(గుంటూరు): పురుగు మందుల పిచికారీకి డ్రోన్ల వినియోగంతో రైతులకు సమయం ఆదా అవుతుందని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు చెప్పారు. స్థానిక కృషి భవన్లో శుక్రవారం సాయంత్రం డ్రోన్ల నమూనాలను రైతుల అవగాహన కోసం ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డీఏఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్కేవీవై పథకం ద్వారా రైతుల గ్రూపులకు 80 శాతం సబ్సిడీపై కిసాన్ డ్రోన్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. డ్రోన్ల తయారీదారుల ప్రతినిధులు రవికుమార్, సుధీర్ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రత్న మహిపాల్రెడ్డి మాట్లాడుతూ రైతులు డ్రోన్లను కొనుగోలు చేయడానికి రుణాల కోసం అన్ని బ్యాంకులకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ప్రతినిధులు, ఏపీ ఆగ్రోస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం
నిజాంపట్నం: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజులపాటు సముద్ర జలాలలో చేపల వేట నిషేధించినట్లు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సాయిసందీప్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సముద్రంలో వివిధ చేపలు, రొయ్యల జాతుల సంతాన ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ప్రతి ఏటా 61 రోజులపాటు వేట నిషేధం అమల్లోకి తెస్తుందన్నారు. ఈ సమయంలో రొయ్య, చేప జాతులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తికి దోహదపడే సమయమన్నారు. వేట నిషేధ సమయంలో మండలంలోని మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదని తెలియజేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి వేటకు వెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్ర సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎం