విద్యారణ్యపురి: ప్రభుత్వ యాజమాన్యాల పరిధి లోని ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా (పీఎంశ్రీ) హైస్కూల్ స్థాయి విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను విస్తృతపరిచేలా, విద్య, పరిశోధనరంగాల పరంగా ఎలా ముందుకెళ్లాలో తెలిపేందుకు ప్రముఖ ఉన్నత విద్యాసంస్థల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి ట్విన్నింగ్ (జంటీకరణ) ఆఫ్ స్కూల్స్ నిధులు వినియోగించనున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని పీఎంశ్రీ స్కూళ్ల విద్యార్థులను వరంగల్ నిట్కు అనుసంధానించారు. విద్యార్థులు ఆ విద్యాసంస్థను సందర్శించి వసతులు, ల్యాబ్స్, లైబ్రరీ పరిశోధనల పరంగా ఎలా ముందుకెళ్తున్నారనేది ప్రత్యక్షంగా తిలకించడంతోపాటు, అక్కడి అధ్యాపకులు, ఇంజనీరింగ్ విద్యార్థులతో ఇంటరాక్షన్ ఉండేలా కలెక్టర్ ప్రావీణ్య ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. దీనిపై నిట్ అధికారులతో సంప్రదించి ఒక ప్రోగ్రాంను డీఈఓ వాసంతి ద్వారా రూపొందించారు. విద్యార్థులు నేడు(గురువారం), రేపు వరంగల్ నిట్ను సందర్శించనున్నారు.
జిల్లాలో 19 పీఎంశ్రీ స్కూళ్లు
పీఎంశ్రీ కింద జిల్లాలో 19 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో కేంద్ర 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను మౌలిక సదుపాయాల కల్పనతోపాటు విద్యార్థులకు అనేక విధాలుగా ప్రయోజనాలతో కూడిన విద్యాభివృద్ధికి కేటాయిస్తున్నారు. దీనిని సమగ్రశిక్ష ద్వారా అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా స్కూళ్లకు నిధులు మంజూరయ్యాయి. ప్రధానంగా సైన్స్ల్యాబ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్, ఐసీటీ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, వృత్తి విద్యాకోర్సుల ల్యాబ్స్ను ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు సంబంధించి వివిధ రకాల ప్రోగ్రాంలు ఉన్నాయి. పీఎంశ్రీలో ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్ అనే పథకం ఒకటి. దీనికింద జిల్లాలోని 13 పాఠశాలలకు రూ.20వేల చొప్పున, మరో ఆరు పాఠశాలలకు రూ.35వేల చొప్పున నిధులు విడుదలయ్యాయి.
నిట్కు 2వేల మంది విద్యార్థులు
పీఎంశ్రీ కింద ఎంపికై న ప్రభుత్వ హైస్కూళ్లు, గురుకులాలు, మోడల్ స్కూళ్ల విద్యార్థులు కలిపి జిల్లాలో సుమారు 2వేలమంది ఉంటారు. షెడ్యూల్ ప్రకా రం నేడు (గురువారం) ఉదయం 9–30 నుంచి మ ధ్యాహ్నం 2గంటల వరకు ఒక సెషన్లో 500 మంది, మధ్యాహ్నం 2–10 నుంచి సాయంత్రం 5–45 గంటల వరకు మరో 500 మంది, 21వ తేదీన మరో 1000 మంది విద్యార్థులు వరంగల్ నిట్ను సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. వారిని ప్రత్యేక వాహనాల్లో తీసుకువస్తారు. భోజనం వసతి ఏర్పాటు చేశారు. నిట్తోపాటు హనుమకొండలోని రీజినల్ సైన్స్ సెంటర్, జూపార్కు, వేయిస్తంభాల గుడిని సందర్శించనున్నారు.
హైస్కూల్ విద్యార్థుల్లో పెంపునకు శ్రీకారం
హనుమకొండ జిల్లా పీఎంశ్రీ
పాఠశాలలు నిట్తో అనుసంధానం
ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్
నిధులు వినియోగం
నేడు, రేపు ఆ విద్యాసంస్థను
సందర్శించనున్న పిల్లలు
ట్విన్నింగ్ (జంటీకరణ) స్కూల్స్ అంటే..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సమీపంలోని ఉన్నతవిద్యాసంస్థతో అనుసంధానం చేయడమే ట్విన్నింగ్.
దీనివల్ల ప్రముఖ విద్యాసంస్థల్లోని అవకాశాలను భవిష్యత్లో అందిపుచ్చుకునేలా పిల్లలను ప్రోత్సహించడం, విద్యార్థులతో ముఖాముఖి ద్వారా స్ఫూర్తిని కలిగించేందుకు దోహదం చేస్తుంది.
ఉన్నత విద్యాసంస్థల్లోని ల్యాబ్స్, లైబ్రరీలు, తరగతి గదులు, క్రీడా వసతులు ఎలా ఉన్నాయి, వర్క్షాప్ల పరిశీలన, విద్యాధిపతులు, అక్కడి అధ్యాపకులను కలిసి మాట్లాడే అవకాశం కల్పిస్తారు.
పాఠశాలస్థాయిలోని భవిష్యత్లో ఉన్నత విద్యపట్ల ఆకర్షితులవుతారనేది భావన. విద్యార్థులతో కలిసి మాట్లాడటం ద్వారా సమూహ అభ్యసనం కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment