
ఎకరం @ రూ.1.20కోట్లు
సాక్షి, వరంగల్ : మామునూరు విమానాశ్రయం కోసం సేకరించే వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు పరిహారం ఇచ్చేలా వరంగల్ జిల్లా అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ సత్యశారద తనకున్న విచక్షణాధికారాలతో కన్సంట్ అవా ర్డు కింద ఈ మేరకై తే ఇవ్వగలమని భూములు కోల్పోతున్న నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులతో కలెక్టరేట్లో బుధవారం రాత్రి జరిగిన డిస్ట్రిక్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ సమావేశంలో తేల్చిచెప్పారు. జనరల్ అవార్డు కింద రూ.65లక్షల వరకే ఇవ్వాల్సి ఉన్నా.. స్పెషల్ (కన్సంట్) అవార్డు కింద రూ.కోటి 20 లక్షలు ఇస్తున్నామని రైతులకు ఆమె హామీ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతులు అంగీకరించి సహకరించాలని కోరారు. కాగా, రెండురోజుల్లో చర్చించుకుని భూమి పాస్బుక్లు ఇస్తామని రైతులు చెప్పారు. స్థల సేకరణ కోసం రూ.205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.
నేడు వ్యవసాయేతర భూముల రైతులతో సమావేశం
గుంటూరుపల్లి రైతులు కొత్తగా రోడ్డు ఏర్పాటు చేయాలని కోరగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను తయారు చేసుకొని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. విమానాశ్రయ నిర్మాణంలో వ్యవసాయేతర భూములు కోల్పోతున్న రైతులతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో నేగోషియేషన్ కమిటీ సమావేశం ఉంటుందన్నారు. సమావేశంలో అదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఈఈలు రమేష్, శంకర్, తహసీల్దార్ నాగేశ్వర్, ఇరిగేషన్ డీఈ మధుసూదన్ రెడ్డి, గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపెల్లి, రైతులు పాల్గొన్నారు.
‘మామునూరు’ వ్యవసాయ భూ నిర్వాసితులకు చెల్లింపునకు నిర్ణయం
కలెక్టర్ విచక్షణాధికారాలతో
కన్సంట్ అవార్డు కింద పరిహారం
నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులతో భేటీలో సానుకూల పరిణామం
మరో రెండు రోజుల్లో చర్చించుకుని పాస్బుక్లు ఇస్తామన్న రైతులు
మరో రూ.83 కోట్లు అవసరమే
వ్యవసాయ సాగుకు సంబంధించి 240 ఎకరా లకు భూపరిహారం రూ.288 కోట్లు అవుతున్నా యి. ఇప్పటికే ప్రభుత్వం రూ.205 కోట్లు కేటా యించింది. ఎకరాకు రూ.కోటి 20లక్షల ధర నిర్ణయంతో మరో రూ.83 కోట్లు అదనంగా అవసరం కానున్నాయి. వీటికితోడు మరో 13 ఎకరా ల వ్యవసాయేతర భూములకు గజం లెక్కన ఎంత చెల్లిస్తారన్నది గురువారం జరిగే సమావేశంలో తేలనుంది. ఈ లెక్కన అదనంగా రూ.100 కోట్లకుపైగానే భూపరిహారం కింద రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు భూసేకరణకు ఎకరానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఇక్కడున్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూ.కోటి 20లక్షలు ఎకరానికి పరిహారం కింద చెల్లించడం అధికమని రెవెన్యూ అధికారులు అంటున్నారు.

ఎకరం @ రూ.1.20కోట్లు