
‘సూపర్ స్పెషాలిటీ’ బలోపేతానికి చర్యలు
ఎంజీఎం : రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన అవసరమయ్యే సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కేఎంసీలోని పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి, ఆలస్యంగా విధులకు హాజరైన ఇద్దరు డాక్టర్లు, హెడ్నర్సునుంచి సంజాయిషీ కోరాలని పర్యవేక్షకులను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో డాక్టర్లు, అధికారులతో కలిసి పర్యటించి తక్షణమే కావాల్సిన అవసరాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులతో నియమించిన సభ్యులు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసరంగా కావాల్సిన సౌకర్యాలను పరిశీలించి రేపటిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఫార్మసీలో మందుల నిల్వలను పరిశీలించారు. ఆస్పత్రిలో హిటింగ్ వెంటిలేషన్, ఏయిర్ కండిషన్ సిస్టం మరమ్మతులతోపాటు ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రి ఐదో అంతస్తులోని ఆపరేషన్ థియేటర్ ఈనెల 10వ తేదీలోగా రోగులకు సేవలు అందించేందుకు సిద్ధం చేయాలన్నారు. డయాలసిస్ కేంద్రంలో అదనంగా ఏడు పడకలు, బ్లడ్ ప్యూరిఫైయింగ్ థియేటర్, రోగులు వారి అటెండెంట్ల కోసం షెడ్, ఇందిరా మహిళా క్యాంటీన్ను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్కుమార్ రెడ్డి, డాక్టర్ మురళి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పలత, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గోపాల్ రెడ్డి టీజీఈడబ్ల్యూఐడీసీ, టీజీఎంఐడీసీ, ఇరిగేషన్ శాఖల ఈఈలు ప్రసాద్, రవీందర్, సునీత, సంబంధిత శాఖల అధికారులు, డాక్టర్లు ఉన్నారు.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
సదుపాయాలపై రేపటిలోగా
నివేదిక ఇవ్వాలని ఆదేశం