![Iran presidential election 2024: Iran Presidential Election Heads To Run-Off On July 5 Amid Record Low Turnout](/styles/webp/s3/article_images/2024/06/30/IRAN.jpg.webp?itok=aNNamX4v)
60% మంది ఓటింగ్కు దూరం
అధ్యక్ష పదవికి జూలై 5న మళ్లీ పోలింగ్
దుబాయ్: ఇరాన్ అధ్యక్ష పదవికి శుక్రవారం జరిగిన పోలింగ్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. దేశ చరిత్రలోనే అతి తక్కువ ఓటింగ్ నమోదైన నేపథ్యంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్కు గానీ ఛాందసవాది సయీద్ జలీలీకిగానీ మెజారిటీ దక్కలేదు. దేశ రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్లలో 50 శాతం పైగా సాధించిన వారే అధ్యక్షుడవుతారు.
శుక్రవారం జరిగిన పోలింగ్లో అతి తక్కువగా 39.9 శాతం మందే ఓటేశారు. 60 శాతం మందికి పైగా ఓటింగ్కు దూరంగా ఉండిపోయారు. మొత్తం 2.45 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా శనివారం వెలువడిన ఫలితాల్లో పెజెష్కియాన్కు 1.04 కోట్ల మంది, జలీలీకి 90.4 లక్షల మంది ఓటేశారని అధికారులు ప్రకటించారు.
వీరితోపాటు బరిలో నిలిచిన పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘెర్ ఖలిబాఫ్కు 30.3 లక్షల ఓట్లు, షియా మత పెద్ద మొస్తాఫాకు 2.06 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఫలితాలు వెలువడ్డాక అధ్యక్ష బరి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఖలిబాఫ్ రెండో విడత పోలింగ్లో తన మద్దతు జలీలీకే ఉంటుందని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో జులై 5వ తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది.
ఈ పోలింగ్లో ఎక్కువ మందిని తన వైపు తిప్పుకోగలిగితేనే పెజెష్కియాన్కు గెలిచే అవకాశాలుంటాయి. లేకుంటే, సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మద్దతున్న జలీలీదే పైచేయి అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరాన్లో మరోసారి ఛాందసవాదులే అధికారంలోకి వస్తారని అంటున్నారు.
‘నిరసన తెలపడం ప్రజల హక్కు. ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండటం ద్వారా ఇరాన్ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అధ్యక్ష అభ్యర్థులతోపాటు ప్రస్తుత వ్యవస్థతను సైతం వారు తిరస్కరించారు’ అని లండన్లోని చాతం హúస్లో మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రోగ్రాం డైరెక్టర్ సనమ్ వకీల్ విశ్లేషించారు. అక్కడి వ్యవస్థల పట్ల ప్రజల్లో ఏ మేరకు ఉదాసీనత, నిరాశ గూడుకట్టుకునే ఉన్నాయనేందుకు ఇదే ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment