
ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లా జైలులో ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధిత ఆరోపణలతో బందీగా ఉంటున్న నేపాలీ యువతి జైలు గోడ దూకి పారిపోయింది. దుస్తులతో తాడు తయారు చేసుకుని, దాని సాయంతో ఆ యువతి గోడ దూకి పారిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఆమెను పట్టుకునేందుకు 12 పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఆమె నేపాల్ పారిపోయే అవకాశం ఉన్నందున సహస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)సాయంతో పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో చెకింగ్ కట్టుదిట్టం చేశారు.
ఆచూకీ చెబితే రూ. 10 వేలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిథోర్గఢ్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గల సీసీటీవీ ఫుటేజ్ల సాయంతో ఆ యువతిని వెదికిపట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ యువతి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 వేలు అందజేస్తామని తెలిపారు. పరారైన యువతిని పట్టుకునేందుకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
మాదకద్రవ్యం తరలిస్తుండగా..
నేపాల్లోని దుమలింగ్ గ్రామానికి చెందిన అనుష్క ఉరఫ్ ఆకృతి(25)ని రెండున్నరేళ్ల క్రితం ధార్చులాలో రెండున్నర కిలోల చరస్ (మాదకద్రవ్యం)తరలిస్తుండగా ఎస్ఎస్బీ పట్టుకుంది. ఆమె విచారణలో ఉన్నందున ఆమెను పిథోర్గఢ్ జిల్లా జైలులో బందీగా ఉంచారు. ఆమె పరారైన నేపధ్యంలో జైలుతో పాటు మొత్తం పోలీసు శాఖలో కలకలం చెలరేగింది. దీంతో పోలీసు బృందాలు ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం పరారైన యువతి లింక్ రోడ్డు పరిధిలోని సీసీటీవీలో కనిపించింది. అక్కడి నుంచి ఆమె పాండే గ్రామం మీదుగా పరారవుతూ కనిపించింది.
ఇది కూడా చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం
Comments
Please login to add a commentAdd a comment